కోడెల వర్ధంతి కార్యక్రమాలకు సర్కారు బ్రేక్- కోవిడ్ నిబందనల పేరుతో నోటీసులు..
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వర్ధంతి కార్యక్రమాలకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. కోడెల తొలి వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కోడెల ఫ్యామిలీకి నిరాశ తప్పడం లేదు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు మానుకోవాలని కోరుతూ గుంటూరు పోలీసులు కోడెల తనయుడు శివరామ్కు నోటీసులు ఇచ్చారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కరోనా మార్గదర్శకాల ప్రకారం ప్రజలు భారీగా గుమికూడటం కానీ, సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పాక్షిక లాక్డౌన్ పరిస్ధితుల్లో సమావేశాలు నిర్వహించి భోజనాలు పెడితే ప్రజలు సామాజిక దూరం నిబంధనలు వదిలిపెట్టి ఒకే చోట గుమికూడే అవకాశం ఉందని, తద్వారా వైరస్ ప్రబలుతుందని పోలీసులు తమ నోటీసుల్లో తెలిపారు.
Recommended Video
పోలీసు యాక్ట్ 10 అమల్లో ఉన్నందున సమావేశాలు, అన్నదానాలు ఏర్పాటు చేయడంపై నిషేధం అమల్లో ఉందని పోలీసులు శివరాంకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోడెల వర్ధంతి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అలా కాకుండా సభలు, సమావేశాలు పెడితే చట్టపరంగా చర్యలు తప్పవని నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది.