నేనుండగా నో టి!: కిరణ్, జగన్ వైపు వెళ్లే వారిపై లైట్

తన హయాంలో విభజన జరగదని ఆయన తనను కలిసిన మంత్రులతో చెప్పారని తెలుస్తోంది. పార్టీ వీడుతున్న వారిపై స్పందిస్తూ... 'పోతే.. పోనీ! పార్టీలో 20 మంది మిగిలినా చాల!'ని వ్యాఖ్యానించారట. ఇటీవల నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కాంగ్రెస్ను వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. చేరారు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే మంత్రి పదవికి పినిపె విశ్వరూప్ రాజీనామా చేశారు.
శాసనసభ సభ్యత్వానికీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసేందుకు సన్నద్ధమయ్యారు. జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోమవారం జగన్ను కలిశారు. త్వరలో తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరనున్నట్లు తెలిపారు. జమ్మలమడుగులో పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ పార్టీలో చేరతానని వెల్లడించారు. జగన్కు బంధువైన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి కూడా జగన్ వైపు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.
ఈ నేపథ్యంలోనే, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గంటా శ్రీనివాస రావు, సాకే శైలజానాథ్, గల్లా అరుణ కుమారి, కొండ్రు మురళీ, పితాని సత్యనారాయణ, పార్థసారథి, కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి, ఎమ్మెల్యేలు బండారు సత్యానంద రావు, వీరశివా రెడ్డి, తదితరులు సోమవారం క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిశారు.
జగన్ పార్టీలోకి పలువురు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కొందరు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించగా ఆయన పోతే పోనీ అని వ్యాఖ్యానించారట. కాంగ్రెస్ పార్టీ నేలకు కొట్టిన బంతిలా పైకి లేస్తుందని, ఎన్నికల సమయంలో మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా, గతంలో కాకలు తీరిన నేతలు ఇందిరా కాంగ్రెస్ను కాదనుకుని ఎలా భంగపడ్డారో వివరించారు.
విభజన అంశంపై పార్టీ విధానంలోనే ముందుకు వెళ్దామని ఒక మంత్రి ప్రస్తావించినప్పుడు తాను పార్టీ గీత దాటడం లేదని, మీడియా సమావేశంలో కూడా ఎక్కడా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదని అయితే, విభజన నిర్ణయంతో సీమాంధ్రలో ఎదురయ్యే సమస్యలను ఆలకించకపోతే ఎలా? వారి సమస్యలు పరిష్కారం కాకుండా రాష్ట్ర విభజన జరగదని కిరణ్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications