వైసీపీ వర్సస్ టీడీపీ: ఫలితాల్లో మారుతున్న లెక్కలు - డేంజర్ బెల్స్..!?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. ఆసక్తి కర ఫలితాలు వెల్లడవుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ ఆసక్తి కరంగా మారుతున్నాయి. తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి బలపరిచిన అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో మాత్రం పోరు నున్వా నేనా అన్నట్లుగా మారుతోంది. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో మూడు రౌండ్ల ఫలితాలు ఇప్పటి వరకు వెల్లడి అయ్యాయి. రాయలసీమలోని రెండు స్థానాల్లో వైసీపీ - టీడీపీ బలపర్చిన అభ్యర్దుల మధ్య పోటీ హోరా హోరీగా సాగుతోంది. ఉత్తరాంధ్రలో మాత్రం టీడీపీ లీడ్ లో కొనసాగుతోంది. పీడీఎఫ్ తో టీడీపీ చివరి నిమిషంలో కుదుర్చుకున్న అవగాహన కలిసి వచ్చింది. ఇప్పుడు వైసీపీ నేతలు ఈ ట్రెండ్స్ తో అలర్ట్ అయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ట్రెండ్స్ తో కొత్త లెక్కలు
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఫలితాల్లో పబ్లిక్ మూడ్ స్పష్టం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. టీచర్ల నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒకటి వైసీపీ ఖాతాలో చేరింది. తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు మూడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఫలితాల పైన ఆసక్తి పెరుగుతోంది. రెండు పార్టీలు తమ మద్దతు దారులను గెలిపించుకొనేందుకు పార్టీ నేతలను రంగంలోకి దించాయి. హోరా హోరీగా వ్యూహాలు అమలు చేసాయి. తమ పట్టు నిరూపించుకొనే ప్రయత్నం చేసాయి. మూడు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు మూడో రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. పశ్చిమ రాయలసీమలో వైసీపీ కొంత ఆధిక్యతలో ఉండగా. .ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ లో టీడీపీ అభ్యర్ధులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్ది వెనుకంజ
ఉత్తరాంధ్రలో వైసీపీ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. టీడీపీ చివరి నిమిషంలో అభ్యర్ధిని మార్చింది. వైసీపీ గెలుపు కోసం ఉత్తరాంధ్ర మంత్రులతో పాటుగా టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలితాలను చూస్తే టీడీపీ అభ్యర్ధి ఇప్పటికి 49,512 ఓట్లతో 46.13 శాతం దక్కించుకొని ఆధిక్యతలో ఉన్నారు. వైసీపీ రెండో స్థానంలో ఉంది. వైసీపీకి మూడు రౌండ్లు ముగిసే సమయానికి 29.14 శాతం..31281 ఓట్లు దక్కించుకున్నారు. పీడీఎఫ్ అభ్యర్దికి 18110 ఓట్లు రాగా, సిట్టింగ్ ఎమ్మెల్సీనే తిరిగి అభ్యర్ధిగా బరిలోకి దించిన బీజేపీకి 5193 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ అభ్యర్ధి విజయానికి దగ్గరగా ఉండటంతో..ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితాలు మరి కాసేపట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. విశాఖ కేంద్రంగా ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు వెల్లడవుతున్న ఫలితాలు కొత్త రాజకీయానికి కారణంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
సీమ నియోజకవర్గాల్లో హోరా హోరీ
తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి బలపరిచిన అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం అధికారికంగా వెల్లడైంది. రాయసీమలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తూర్పు సీటులో టీడీపీ ఆధిక్యతలో ఉంది. ఇక్కడ మూడో రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ అభ్యర్ధి 49,173 ఓట్లు, వైసీపీ అభ్యర్ధి 39,615, పీడీఎఫ్ అభ్యర్ధి 16250 ఓట్లు దక్కించుకున్నారు. ఇక్కడ గెలుపుకు ఏ అభ్యర్ధికి అయినా 55166 ఓట్లు అవసరం. మరో రౌండ్ లెక్కింపు తరువాత ఫలితం ఖరారు కానుంది. ఇక.. పశ్చిమ రాయలసీమ సీటులో హోరా హోరీ పోరు సాగుతోంది. మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడి కాగా.. టీడీపీకి 26929 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్దికి 28872, పీడీఎఫ్ అభ్యర్దికి 5532 ఓట్లు పోలయ్యాయి. దీంతో..అటు ఉత్తరాంధ్ర, ఇటు సీమ ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వెల్లడవుతున్న ఫలితాలతో అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications