పవన్ వైపు చూస్తోన్న ఉత్తరాంధ్ర జనం.. జనసేనాని కదులుతారా?
విశాఖపట్నం : ఏపీలో రాయలసీమతో పాటు మరో వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర. దశాబ్దాలుగా ఈ రెండు ప్రాంతాలు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి. తమ ప్రాంత ప్రజల నుంచి బలమైన గొంతు వినిపించే నాయకుడెవరైనా ఉండుంటే బాగుండు అన్న అభిప్రాయం ఉత్తరాంధ్రలో బలంగా ఉంది. రాయలసీమ విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఈ లోటును కొంతవరకు తీర్చగలిగారని భావించేవారు లేకపోలేదు.
ఇకపోతే అనంత కేంద్రంగా జనసేన క్రియాశీలక రాజకీయాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీ నిర్మాణానికి తొలి అడుగు అనంత నుంచే మొదలవుతుందన్న ఆయన.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం అని తేల్చేశారు. దీంతో ఆయన పోటీ ఎక్కడినుంచి ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పశ్చిమగోదావరి జిల్లాతో పవన్ కు మంచి అనుబంధం ఉండడంతో.. ఏలూరు లేదా పాలకొల్లు నుంచి ఆయన పోటీ ఉండవచ్చునన్న అభిప్రాయాలున్నాయి. అదే సమయంలో.. అనంతపురం జిల్లా నుంచే పవన్ పోటీ ఉండబోతుందనేది మరికొందరి వాదన. ఇన్ని అభిప్రాయాల నడుమ ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా పవన్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
రాయలసీమ లాగే వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉత్తరాంధ్రలోను పవన్ కు అభిమాన ఘనం భారీగానే ఉంది. పైగా.. సినిమాల ద్వారా ఉత్తరాంధ్రపై పరోక్ష అభిమానాన్ని చాటుకున్నారు పవన్. గతంలో 'బై బై రే.. బంగారు రవణమ్మ' లాంటి ఉత్తరాంధ్ర యాసతో కూడిన పాటలను తన సినిమాల ద్వారా వినిపించారు. తాజాగా ఆయన పొలిటికల్ గాను యాక్టివ్ గా మారడంతో.. ఉత్తరాంధ్ర గొంతును సైతం పవన్ వినిపించాలని అక్కడి జనం భావిస్తున్నారు.
ఇందుకోసం ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే పోటీకి దిగితే.. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందనేది వారి వాదన. ఉత్తరాంధ్ర జిల్లా అయిన విశాఖతో పవన్ కు విడదీయరాని అనుబంధమే ఉంది. నటనలో ఓనమాలు ఇక్కడినుంచే నేర్చుకున్నారు పవన్. సామాజిక సమీకరణాల పరంగా చూసుకున్నా.. ఈ ప్రాంతంలో పవన్ కు మంచి ఆదరణే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాబట్టి వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంలలో ఏదేని ఓ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పవన్ పోటీ చేయాలని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. మరి రాయలసీమ-ఉత్తరాంధ్రల్లో పవన్ ఎక్కడినుంచి పోటీ చేస్తారు? ఈ రెండు కాక కోస్తాంధ్ర నుంచే ఆయన పోటీ చేస్తారా? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. వచ్చే ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే.