తెలంగాణ కోర్టు మాటా వినట్లేదు: గంటా, అమ్మాయిల ఆత్మహత్యలకు ఒత్తిడే కాదు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణ కళాశాలల్లో ప్రవేశాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల మాట కూడా వినడం లేదని ఏఫీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్టోబర్ 15న కలాం పేరట ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. అదే రోజు నాగార్జున విశ్వవిద్యాలయంలో కలాం విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారన్నారు. నవంబర్ నుంచి ప్రతి నెల మొదటి సోమవారం డయల్ యువర్ యూనివర్సిటీ కార్యక్రమం ఉంటుందన్నారు.
విజయవాడలోని స్టెల్లా కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న భానుప్రీతి ఆత్మహత్యపై నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. రిషికేశ్వరి మృతికి సంబంధించిన ఫైలు తన వద్దకు రాలేదని, ముఖ్యమంత్రి వద్ద పెండింగులో ఉందని చెప్పారు.
ఎంసెట్ రద్దు పైన నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తామని గంటా చెప్పారు. కార్పోరేట్ కళాశాల్లో విద్యార్థుల ఆత్మహత్యకు ఒత్తిడి ఒక్కటే కారణం కాదన్నారు. అనారోగ్యం, ఇతర సమస్యలు కూడా కారణమన్నారు.
ఏపీ ఉన్నత విద్యాశాఖ కార్యాలయాన్ని త్వరలో నాగార్జున వర్సిటీకి తరలిస్తున్నామన్నారు. అంతకుముందు ఉమ్మడి విశ్వవిద్యాలయాల్లో లోపాలపై సచివాలయంలో మంత్రి గంటాకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి కమిటీ నివేదిక సమర్పించింది. లోపాల పరిష్కారానికి కమిటీ పలు సిఫార్సులు చేసింది.