మోడీకి షాక్: మాకు సంబంధం లేదు.. పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు యూటర్న్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నోట్ల రద్ద పైన మంగళవారం నాడు యూ టర్న్ తీసుకున్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నోట్ల రద్ద పైన మంగళవారం నాడు యూ టర్న్ తీసుకున్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నోట్ల రద్దు అనేది మనం కోరుకున్నది కాదన్నారు. అది అలా జరిగిపోయిందన్నారు. నోట్ల రద్దు వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. మరెన్నో సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు.
పెద్ద నోట్ల రద్దు అంశం చాలా సున్నితమైనదన్నారు. సంక్లిష్టమైన అంశమని చెప్పారు. రోజుకు రెండు గంటల పాటు తాను ఈ విషయమై ఆలోచిస్తున్నానని చెప్పారు. సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయమై బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా సమాధానం దొరకడం లేదన్నారు.

డిజిటల్ లావాదేవీల పైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నియమించిన కమిటీకి చంద్రబాబు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడటంపై తెలుగు తమ్ముళ్లు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు విషయంలో మాత్రం చంద్రబాబు సూచనల మేరకు తెలుగు తమ్ముళ్లు నడుచుకోనున్నారు.
కాగా, నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. దీనిని తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. అంతేకాదు, నోట్ల రద్దు కోసం తాను పలుమార్లు ప్రధాని మోడీకి లేఖ రాశానని చంద్రబాబు చెప్పారు. ఇది టిడిపి విజయమని తెలుగు తమ్ముళ్లు చెప్పారు.
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోట్ల రద్దుపై మండిపడుతున్నారు. ఆయన కూడా తొలుత స్వాగతించారు. ఆ తర్వాత సమస్యలను ఎత్తి చూపుతూ మండిపడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు చంద్రబాబు కూడా నోట్ల రద్దు పైన ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications