టీడీపీ కార్యాలయానికి పోలీసుల నోటీసులు - పది మంది గుర్తింపు..అరెస్ట్ : రంగంలోకి స్పెషల్ టీంలు..!!
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఒక్కసారిగా వైసీపీ అభిమానులు టీడీపీ కార్యాలయం పైన దాడి చేసారు. అక్కడ ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేసారు. దీని పైన టీడీపీ పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీనికి నిరసనగా 36 గంటల దీక్ష చేసారు. ప్రభుత్వం పోలీసులు కలిసి ఈ దాడులకు ప్రోత్సహించారంటూ ఆరోపణలు చేసారు. ఇదే అంశం పైన రాష్ట్రపతితో పాటుగా జాతీయ స్థాయిలోనూ ఫిర్యాదు చేయటానికి చంద్రబాబు సిద్దమయ్యారు.
టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు
ఇదే సమయంలో పోలీసు శాఖ టీడీపీ కార్యాలయం పైన దాడికి కారకులను గుర్తించే పనిలో పడింది. దాడికి పాల్పడిన పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసు విచారణలో భాగంగా.. టీడీపీ కార్యాలయానికి మంగళగిరి పోలీసుల నోటీసులు ఇచ్చారు. దాడి ఘటన పైన టీడీపీ కార్యాలయ ఉద్యోగి బద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు. విచారణలో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషనుకు వచ్చి వివరాలు అందివ్వాలని పార్టీ రిస్పెషన్ కమిటీ సభ్యుడు కుమార స్వామికి నోటీసులను జారీ చేసారు.
సాయంత్రం లోగా హాజరు కావాలంటూ
పార్టీ కార్యాలయానికి సంబంధించిన నోటీసులు ఆఫీసు గోడ పైన అంటించారు. టీడీపీ ఆపీసు పైన దాడి కేసులో పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అదే విధంగా మిగిలిన వారిని పట్టుకొనేందుకు నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెప్పారు. ఇక, విజయవాడలో పట్టాభి ఇంటి పైన దాడి చేసిన ఘటనలో 11 మంది నిందితులను పటమట పోలీసులు అరెస్ట్ చేసారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటంతోనే అభిమానులు ఆవేశానికి లోనై దాడికి దిగారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు
అయితే, తాజాగా ఈ 21న జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి జగన్ తమ వైఖరిని స్పష్టం చేసారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పారు. లా అండ్ ఆర్డర్ అంశంలో తన ..మన చూడవద్దని..కఠినంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. ఇక, ఇప్పటికే టీడీపీ నేత సోమిరెడ్డి పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన వారి ఫొటోలను విడుదల చేసారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారంటూ వారి పేర్లు..కార్ల నెంబర్లను బయట పెట్టారు.
పది మంది అరెస్ట్.. మిగిలిన వారి కోసం టీంలు
ఇప్పుడు పోలీసులు దాడికి పాల్పడిన 10 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక, మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు. టీడీపీ కార్యాలయం నుంచి ఆ రోజు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే..మిగిలిన వారిని గుర్తించగలుగుతామని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు టీడీపీ నేతలు పోలీసుల నోటీసుల విషయంలో ఏరకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఈ దాడి ఘటన రాజకీయంగా రాష్ట్రంలో కలకలం రేపింది. అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లకు కారణమైంది. ఇక, అటు పట్టాభి రాజమండ్రి జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ పిటీషన్ పైన ఈ మధ్నాహ్నం తరువాత విచారణ జరగనుంది.