ఏపీ ‘రాజ్యసభ’కు నోటిఫికేషన్ విడుదల: ఇక వైసీపీ నుంచి ‘పెద్దల’పై క్లారిటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు రాజ్యసభ స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉండటంతో.. అధినేతకు ఆశావాహులు టచ్లోనూ ఉంటున్నారు.
13న నామినేషన్ చివరి గడువు
ఈ నేపథ్యంలో శుక్రవారం రాజ్యసభకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధప్రదేశ్ రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు అసెంబ్లీ కార్యదర్శి. శుక్రవారం నుంచి మార్చి 13వ తేదీ లోపు నామినేషన్లు తుది గడువు. మార్చి 16వ తేదీ నామినేషన్ల పరిశీలన, మార్చి 18వ తేదీని మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహ్మద్ అలీ ఖాన్, టీ సుబ్బిరామిరెడ్డి, కే కేశవరావు, తోట సీతారామ లక్ష్మిల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం రానుంది. కాాగా, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది.
వారికి తగిన న్యాయం చేసే ఆలోచనలో జగన్..
కాగా, రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను పెద్దల సభకు పంపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్సీలుగా ఉన్న వీరిద్దరిని రాజ్యసభకు పంపాలని జగన్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ అనుకున్నట్లుగానే శాసనమండలి రద్దు అయితే, ఆ ఇద్దరు మంత్రులు కూడా తమ పదవులను కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వారికి రాజ్యసభకు పంపితే తగిన న్యాయం చేసినట్లవుతుందని వైసీపీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
భవిష్యత్ అవసరాలు.. సన్నిహితులకు ప్రాధాన్యత..
ఇక మరో రెండు రాజ్యసభ స్థానాలపైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తనకు, తన పార్టీకి మొదట్నుంచి సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలిచిన సీనియర్ నేత అయోధ్య రామిరెడ్డిని కూడా పెద్దల సభకు పంపాలని జగన్ నిశ్చియించినట్లు తెలుస్తోంది. ఇక మరో స్థానం ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ సూచించినట్లుగా వార్తలు వినిపిస్తున్న పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఖాయంగా కనిపిస్తోంది.
రాష్ట్రానికి చెందిన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముకేష్ అంబానీకి సన్నిహితుడైన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడానికి జగన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఎంపికలన్నీ దాదాపు ఖరారైనట్లేనని తెలిసినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. నోటిఫికేషన్ కూడా విడుదలైన నేపథ్యంలో త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.