తెలుగు విద్యార్థులకు మరో షాక్: 20 మందిని తిప్పి పంపిన అమెరికా
చికాగో: అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చిన తెలుగు విద్యార్థులకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 20 మంది తెలుగు విద్యార్థులు ఆదివారం చికాగో విమానాశ్రయంలో అడుగు పెట్టారు. వారలా దిగారో లేదో వెంటనే అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు వారి ఎఫ్1 వీసాలను రద్దు చేసి వెనక్కి పంపించేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన విద్యార్థులు వీరిలో ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారని తానా చెప్పింది. చికాగో సమీపంలోని విశ్వవిద్యాలయంలో చేరడానికి వారు వచ్చినట్లు చెప్పింది.
గత వారం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో 14 మంది భారతీయ విద్యార్థులను అధికారులు నిర్బంధించి అనేక గంటలపాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 19 మంది విద్యార్థులను ఎయిర్ ఇండియా అధికారులు హైదరాబాద్లోనే అడ్డుకున్నారు.
అంతేకాకుండా, ఎతిహాద్ ఎయిర్వేస్ మరో 20 మంది విద్యార్థుల్ని అమెరికా విమానం ఎక్కకుండా అడ్డుకుంది. వీరిలో పలువురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. శాన్హోసెలోని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, కాలిఫోర్నియాలోని నార్త్వెస్టర్న్ పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరేందుకు వీరు బయలుదేరినప్పుడు ఈ అనుకోని పరిణామాలు ఎదురయ్యాయి.
ఈ యూనివర్సిటీలను తాము నిషేధించినట్లు అమెరికా ప్రభుత్వం చెబుతుండగా, తమపై ఎలాంటి నిషేధం లేదని ఈ వర్సిటీలు అంటున్నాయి. భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు అవమానించారని, టెర్రరిస్టుల్ని ప్రశ్నించినట్టు వారిని ప్రశ్నించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, అమెరికా నుంచి సమాధానం కోరతామని భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కొద్ది రోజుల కిందట ప్రకటించారు. అమెరికాలో నిషేధించిన యూనివర్సిటీల జాబితాను తెప్పించి అందరికీ అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.