కర్ణాటకలో బీజేపీ ఓటమి ఎఫెక్ట్ - ఏపీలో వ్యూహం మారిందా..!!
కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయింది. దక్షిణాదిన ఉన్న ఒక్క రాష్ట్రాన్ని చేజార్చుకుంది. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దక్షిణాదిన బీజేపీ లక్ష్యం తెలంగాణ. ఆ తరువాత ఏపీలో ఎన్నిక లు జరగనున్నాయి. బీజేపీ ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగిస్తోంది.
తాజాగా జనసేన-టీడీపీ పొత్తు దాదాపు ఖరారైంది. బీజేపీ కూడా కలిసి రావాలని కోరుతున్నారు. వస్తుందని చెబుతున్నారు. బీజేపీ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కర్ణాటకలో కోల్పోయిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఏం చేయబోతోంది.

తెలంగాణలో బీజేపీ వ్యూహాలు: దక్షిణాదిన బలపడాలనేది బీజేపీ ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో మాత్రమే అధికారం దక్కుతూ వస్తోంది. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఆ ఒక్క రాష్ట్రంలోనూ ఓటమి తప్పలేదు. దక్షిణాదిన బీజేపీ లక్ష్యంగా ఎంచుకున్నది తెలుగు రాష్ట్రాలు. తెలంగాణ పైనే ఎక్కువగా బీజేపీ నేతలు ఫోకస్ చేస్తున్నారు.
వచ్చే ఎన్నికలను అక్కడ టార్గెట్ గా ఫిక్స్ చేసుకుంది. తెలంగాణలో పొత్తులతో వెళ్తుందా.. ఒంటరి గా పోటీ చేస్తుందా అనేది ఇప్పటి వరకు తేల్చలేదు. రాష్ట్ర నేతలు పొత్తుల ప్రసక్తే లేదని చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగే తొమ్మది రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ కూడా ఉంది. దక్షిణాదిన బీజేపీ ప్రభావం చూపుతున్న రాష్ట్రం కూడా కర్ణాటక తరువాత తెలంగాణ మాత్రమే.
పొత్తులకు అంగీకరిస్తుందా: తెలంగాణలో బీజేపీ లక్ష్యం చేరుకొనేందకు స్నేహ హస్తం అందించేందుకు టీడీపీ, జనసేన సిద్దంగా ఉన్నాయి. అదే సమయంలో ఏపీలోనూ వైసీపీకి పరోక్షంగా సహకారం అందించకుండా తమతో కలిసి రావాలని కోరుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు.
ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఫలితాలతో కమలం పార్టీ ఈ రెండు పార్టీల తో పొత్తుకు మొగ్గు చూపుతుందని..ఇప్పుడు బీజేపీ అవసరమని చర్చ మొదలైంది. పొత్తు ద్వారా జరిగే లాభ - నష్టాల పైన బీజేపీ బేరీజు వేస్తోంది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు ధీటుగా తాము వ్యవహరించాల్సి ఉందని చెబుతున్న బీజేపీ నేతలు పొత్తుల పైన అంత త్వరగా తేల్చే అవకాశం కనిపించటం లేదు.
బీజేపీ నిర్ణయం కోసం: ఏపీలో వైసీపీ - బీజేపీ నాయకత్వం మధ్య ఉన్న సంబంధాలను దెబ్బ తీయటమే లక్ష్యంగా టీడీపీ-జనసేన పావులు కదుపుతున్నాయి. ఏపీలో టీడీపీ స్థానంలో తాము ఎదగాలనేది బీజేపీ వ్యూహం. ఏపీలో వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వటం ద్వారా టీడీపీ బలహీనడపే అవకాశం ఉంటుందనేది బీజేపీ నేతల అంచనా.
బీజేపీ కలిసి రాకపోయినా టీడీపీ-జనసేన పొత్తు ఖాయం. బీజేపీ కర్ణాటకలో ఓడినా..తెలుగు రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్ ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, కర్ణాటకలో ఓటమితో ఖచ్చితంగా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పొత్తులతోనే ముందుకు వెళ్లే అవకాశం ఉందనే అంచనా ఉంది. ఇప్పుడు బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications