బొత్స బిజెపి వైపు చూస్తున్నారా? పోటీపై తర్జన భర్జన
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా!? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో చేరుతున్న విషయం తెలిసిందే. ఎన్నాళ్లుగానో కాంగ్రెసు పార్టీలో ఉన్న జెసి దివాకర్ రెడ్డి వంటి వారు ఆ పార్టీని వీడారు.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి బాగాలేదని గుర్తించినందువల్లే నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని అంటున్నారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధమైందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా బొత్స పేరు కూడా వినిపిస్తోంది.
ఇటీవల కాంగ్రెసు పార్టీ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక కమిటీలను వేసింది. ఇందులో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని బొత్స అలక వహించారని అంటున్నారు. అయితే, విభజన సమయంలో పార్టీకి గట్టి మద్దతుగా నిలబడిన బొత్స కాంగ్రెసు పార్టీని వీడటం అంటే నమ్మదగిన విషయం కాదని ఇంకొందరు కొట్టి పారేస్తున్నారు.

ఎక్కడి నుండి పోటీ?
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బొత్స అసెంబ్లీకి పోటీ చేస్తారా? పార్లమెంట్ స్థానానికి మొగ్గుచూపుతారా అన్న అంశం చర్చనీయాంశమవుతోంది. నిన్న మొన్నటి వరకు ఆయనకు పెట్టని కోటగా ఉండే విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నేడు కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. దీంతో ఆయన అక్కడ నుంచే తిరిగి పోటీ చేస్తారా, విజయనగరం ఎంపి స్థానానికి పోటీ చేస్తారా అనే విషయం తేలటం లేదు.
జిల్లాలో ఒక పార్లమెంటు, 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు అసెంబ్లీ స్థానాలు రిజర్వుడు కాగా, మిగిలిన ఆరు స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. సాలూరు ఎస్సీకి, పార్వతీపురం, కురుపాం స్థానాలు ఎస్టీకి కేటాయించారు. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, ఎస్.కోట స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. వీటిలో బొబ్బిలి, సాలూరు అసెంబ్లీ స్థానాల్లో వైకాపాకు మొగ్గు కనపడుతోంది.
విజయనగరం, పార్వతీపురం అసెంబ్లీ స్థానాల్లో టిడిపి పట్టు పెంచుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఎస్కోట, చీపురుపల్లి స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి బొత్స బరిలో దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే బొత్సకు కంచుకోటగా నిలిచిన చీపురుపల్లి నేడు బీటలు వారింది. అక్కడ బలమైన సామాజిక వర్గానికి చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ ఇటీవల కాంగ్రెస్ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరగా, ఎఎంసి మాజీ చైర్మన్ మీసాల వరహాలనాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications