నిన్న పవన్... నేడు జగన్కు 'మెగా' షాక్: దాసరిని చిరంజీవి అడ్డుకుంటున్నారా!?
నిన్నటి దాకా చిరంజీవి - దాసరి నారాయణ రావుల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు ఇద్దరు మిత్రులయ్యారని అంటున్నారు.
విజయవాడ: నిన్నటి దాకా చిరంజీవి - దాసరి నారాయణ రావుల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు ఇద్దరు మిత్రులయ్యారని అంటున్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ విభేదాలు లేవని వారు ఖండించడం వేరే విషయం.
చిరంజీవి-దాసరి స్నేహం, మారుతున్న ఈక్వేషన్స్: అసలేం జరుగుతోంది?
దాసరి నారాయణ రావు వైసిపికి దగ్గర కాకుండా చిరంజీవి అడ్డుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. చిరు - దాసరిల మధ్య విభేదాలు ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా ప్రచారం సాగింది. కానీ ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో దాసరి - చిరులు పాల్గొనడమే కాకుండా, పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు.
ముద్రగడతో ఏకమై.. జగన్కు షాక్!
వారిని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఒక్కటిగా చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కాపు ఉద్యమం కారణంగానే వారు ఏకమయ్యారని అంటున్నారు. అదే సమయంలో ఈ కారణంగా ఆయన జగన్కు దగ్గర కాలేకపోతున్నారని అంటున్నారు.
పవన్ మద్దతుతో కాపు ఓట్లు
గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపి కూటమికి మద్దతిచ్చారు. దీంతో టిడిపి అధికారంలోకి వచ్చింది. పవన్ మద్దతివ్వకుంటే ఫలితాలు తారుమారు అయ్యేవని అంటారు. అందుకు కాపు ఓట్లు టిడిపికి పడటమే. దానికి పవన్ కారణంగా చెబుతారు. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ఉన్నారు.
పార్టీలకు ఇమేజ్ ఉన్న నేతలు
పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో గోదావరి జిల్లాలది కీలక పాత్ర. అలాంటి జిల్లాలోని కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలకు ఆయా బలాలు, బలం ఉంది. ఇమేజ్ ఉన్న నాయకులు కనిపిస్తున్నారు. పవన్ టిడిపిలో లేనప్పటికీ ఆయనను దూరం చేసుకోకుండా ఉండేందుకు టిడిపి శాయశక్తులా కృషి చేస్తోంది.
జగన్ వైపు అడుగేసినట్లుగా కనిపించిన దాసరి
చిరంజీవి, పవన్ తరహా ఇమేజ్ కలిగిన నాయకులు వైసిపికి లేరు. దీంతో గతంలో జగన్.. దాసరి వైపు చూశారు. దీంతో దాసరి వైసిపిలో చేరుతారనే ప్రచారం సాగింది. అప్పుడు ముగ్గురు కీలక కాపు నేతలు మూడు పార్టీలలో లేదా మూడు పార్టీల వైపు ఉన్నట్లుగా అవుతుందని భావించారు.
చిరంజీవి షాకిస్తున్నారా?
కానీ, దాసరికి దగ్గర కావడం వల్ల చిరంజీవి ఆయనను వైసిపి వైపు వెళ్లకుండా చేసినట్లయిందని అంటున్నారు. అయితే, ఆయన కాంగ్రెస్లోకి తిరిగి వస్తారా? చిరంజీవితో అదే స్నేహం కొనసాగిస్తూ వైసిపిలో చేరుతారా? లేక ఇన్నాళ్లు ఉన్నట్లుగానే మౌనంగా ఉంటారా అనే చర్చ సాగుతోంది. లేదా టిడిపి చెబుతున్నట్లు 2019 నాటికి కాంగ్రెస్ - వైసిపిలు ఏకమవుతాయా తెలియాల్సి ఉంది.