ఆ దెబ్బకి యూటర్న్, డైలమా: కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ షాక్!
సమైక్యాంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఎప్పటికి అప్పుడు రాజకీయ పునఃప్రవేశం పైన చర్చ జరుగుతోంది. గతంలోను ఒకటి రెండుసార్లు చర్చ జరిగింది.
చిత్తూరు: సమైక్యాంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఎప్పటికి అప్పుడు రాజకీయ పునఃప్రవేశం పైన చర్చ జరుగుతోంది. గతంలోను ఒకటి రెండుసార్లు చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి కిరణ్ రెడ్డి రాజకీయాల పైన చర్చ సాగుతోంది.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఏమాత్రం ప్రభావం చూపని కిరణ్ రెడ్డి ఆ తర్వాత రాజకీయాలలో కనిపించలేదు. అయితే, అడపాదడపా ఆయన పైన మాత్రం ప్రచారం సాగుతోంది.
అప్పుడు బీజేపీ పైన తగ్గారు
తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని.. కాదు కాదు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆ రెండు పార్టీల వైపు ఆయన చూసే పరిస్థితి లేదని అంటున్నారు. గతంలో ఆయన బీజేపీలో చేరాలనుకున్నారని, కానీ పరిస్థితుల నేపథ్యంలో తగ్గారని అంటున్నారు.
కొద్ది రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరాలని బలంగా భావించారని అంటున్నారు. అయితే, ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చక పోవడం ఆయన చేరికకు అడ్డు పడిందని అంటున్నారు.
కాంగ్రెస్ విభజన.. బీజేపీ హోదా
వ్యాంధ్ర ప్రజలు విభజన పట్ల నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ఒక్క పార్లమెంటు, అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు. ఎక్కువ స్థానాలలో డిపాజిట్లు కోల్పోవడం కూడా గమనార్హం.
అప్పుడు విభజన పట్ల నవ్యాంధ్ర ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో.. ఇప్పుడు ప్రత్యేక హోదా పైన కూడా అంతే ఆవేదనతో ఉన్నారు.
బీజేపీ హామీ
విభజనతో ఏపీకి నష్టం జరిగిందని, ప్రత్యేక హోదాతో దానిని భర్తీ చేస్తామని బీజేపీ నాడు హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు సాంకేతిక కారణాలు చూపిస్తూ చేతులెత్తేసింది. హోదా బదులు దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెబుతోంది. అయితే ప్రజలు మాత్రం హోదా సెంటిమెంటుతో ఉన్నారు.
కిరణ్ రెడ్డి ఆశలు హోదాతో గల్లంతు!
ప్రత్యేక హోదా పైన బీజేపీ నేతల ప్రకటనకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి కమలం పార్టీలో చేరాలని భావించారని అంటున్నారు. అయితే హోదా పైన బీజేపీ యూ టర్న్ తీసుకోవడంతో ఆయన ఆశలు గల్లంతయ్యాయని, దీంతో మళ్లీ పార్టీ కోసం వెతుక్కునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. టిడిపిలో, వైసిపిలో, కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరే పరిస్థితి లేదంటున్నారు. 2019 వరకు ఆయన ఏం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.