సృష్టికర్తనే జగన్, నెహ్రూనీ మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు వికర్ష్: పత్తిపాటి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ 'సేవ్ డెమోక్రసీ' పేరుతో నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం నాడు భగ్గుమన్నారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు జగన్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అసలు ఫిరాయింపుల సృష్టికర్తనే వైయస్ జగన్ అన్నారు. పీవీ నర్సింహా రావు హయాంలో ఏడుగురు ఎంపీలు ఫిరాయించారని, అణు ఒప్పందం సమయంలో ఆరుగురు ఎంపీలు ఫిరాయించారని చెప్పారు. ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభం చేసింది ఎవరో ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు.
వైయస్ హయాంలో ఆపరేషన్ ఆకర్ష్కు 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరారని చెప్పారు. నాడు ఎమ్మెల్యేలను వైయస్ కొన్నారన్నారు. అనంతపురం జెడ్పీలో ఫిరాయింపులు ప్రోత్సహించింది ఎవరని ప్రశ్నించారు. ఫిరాయింపుల పైన మాట్లాడే హక్కు జగన్కు లేదన్నారు.
వైయస్ హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ జరిగితే, ఇప్పుడు కొడుకు హయాంలో ఆపరేషన్ వికర్ష్ జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదన్నారు. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నందున జగన్ బీద అరుపులు అరుస్తున్నారన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తగలబడే ఇళ్లు అని, మునిగిపోయే నావ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని చెప్పారు. సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకు కూడా జగన్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు.
మరో మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు అంటే భయం లేదన్నారు. కానీ ప్రజాధనం వృథా చేయడం తమకు ఇష్టం లేదని చెప్పారు. జగన్ తీరు నచ్చకనే వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పారు.