ఎన్ఆర్ఐలు జన్మభూమి-మా ఊరులో పాల్గోండి...చంద్రబాబు పిలుపు
అమరావతి: ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలివచ్చి జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది స్థానిక అభివృద్ది కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్నిపెంచేలా వారిలో స్ఫూర్తి రగిలించే కార్యక్రమమన్నారు.
వచ్చే నెల 2 నుంచి జరగనున్న జన్మభూమి- మా ఊరు కార్యక్రమం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి శనివారం సచివాలయంలో సమీక్షించారు. జన్మభూమి-మా ఊరులో ఐదు లక్షల పంట కుంటల్ని జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ రాష్ట్రంలోని ప్రతి గడపకు చేరాలన్నారు. ఈ కార్యక్రమం లక్ష్యాలను ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా వివరించారు.

లోకేష్ వివరణ...
అనంతరం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు, కుటుంబ, సమాజ వికాసం లక్ష్యాలపై వెబ్పోర్టల్లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. పురపాలకశాఖ వెబ్ పోర్టల్లో కూడా స్థానిక వివరాలు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

మన రాష్ట్రానివే...
అంత్యోదయ మిషన్ కింద దేశవ్యాప్తంగా ఎంపికైన 83 గ్రామ పంచాయతీల్లో 33 ఆంధ్రప్రదేశ్లోనివే కావడం విశేషమని చంద్రబాబు చెప్పారు. గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలకు గ్రామ పంచాయతీయే ముఖద్వారంగా ఉండాలన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమం పది రోజులూ పది అంశాలపై గ్రామస్థాయిలో విస్తృత చర్చ జరగాలని, ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

ఆటపాటలు... సాంస్కృతిక కార్యక్రమాలు
జన్మభూమి-మా ఊరు కార్యక్రమం చివరి రోజు ఆటలతో పాటు, వివిధ అంశాల్లో పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని సన్మానించాలన్నారు. ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేయాలని చెప్పారు.

కార్యక్రమాలు ఇవే...
జన్మభూమి-మా ఊరు లో ఈ కార్యక్రమాలను ఖచ్చితంగా నిర్వహించేలా చూడనున్నారు. ఆ కార్యక్రమాలు ఇవీ...మండల కేంద్రాలు, పట్టణాల్లో జనవరి 7న 5 కిలోమీటర్ల పరుగు, 175 నియోజకవర్గాలతో పాటు, జిల్లా కేంద్రాల్లో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్లాష్మాబ్స్ నిర్వహణ, ఒక్కో రోజు ఒక్కో అంశంపై చిత్రలేఖన, వక్తృత్వ, వ్యాస రచన పోటీలు, చివరి రోజు పెయింటింగ్స్ ప్రదర్శన...ఈ కార్యక్రమంలో
సాంస్కృతిక ప్రదర్శనల నిమిత్తం మొత్తం 175 బృందాల నియామకం జరిగింది.












Click it and Unblock the Notifications