టీడీపీ కార్యాలయం కోసం ఇళ్లు ఖాళీ: బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు
గుంటూరు: టీడీపీ పార్టీ ఆఫీసు కోసం తమ ఇళ్లను ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని చిలకలూరిపేటలోని ఎన్ఎస్పి ఓఅండ్ఎమ్ క్యాంప్ కాలనీ వాసులు లింగంగుంట్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యం.ఆర్ మోహిద్దీన్ను శనివారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులతో కలసి బాధితులు శనివారం ఈఈని కలిసారు.
వివరాల్లోకి వెళితే, ఎన్ఎస్పి ఓఅండ్ఎమ్ సెక్షన్లో పనిచేస్తున్న పది కుటుంబాలు క్యాంప్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే ఈనెలలో సీఎం చంద్రబాబు పర్యటన ఉందంటూ క్యాంప్ ఆవరణలో నిర్మాణాలు చేపడతున్నామని ఖాళీ చేయాల్సిందిగా వివరించారు.
ఇప్పటికే అక్కడ పైలాన్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. తాము నివసిస్తున్న ఇళ్ళను కూల్చివేస్తామని, ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇళ్ళకు తాగునీరు సరఫరాతో పాటు కార్యాలయానికి కరెంటు కట్చేసినట్టు వివరించారు. దీంతో కాలనీలో ఉన్న కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి.
మరోవైపు ఎన్ఎస్పికి చెందిన స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసిందన్నారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తమ జీతంలో ప్రతి నెలా ఇంటి అద్దెను మినహాయిస్తున్నారని తెలిపారు.
పార్టీ కార్యాలయం కోసం మమ్మల్ని నడివీధిలోకి వెళ్లమంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు చదువుకుంటున్నారని, అటు ఇటు కాకుండా విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నప్పుడు ఇళ్లు ఖాళీ చేయమంటే ఎక్కడకు వెళ్ళాలో అర్ధంకావడం లేదన్నారు.
ఈ విషయంపై స్పందించిన ఈఈ చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం అధికారులతో చర్చించి సమస్యను మీరే పరిష్కరించుకోవాలంటూ ఆయన బాధితులకు సలహా ఇచ్చాడు. మున్సిపాలిటి చేపట్టిన పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 10వ తేదీలోపు తమ సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఎన్జీవొ నాయకులతో కలసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.