జూ. ఎన్టీఆర్ను అవమానిస్తోంటే చూస్తూ ఊరుకోవాలా - అందుకే ఆ పని..!!
విజయవాడ: రాష్ట్ర రాజకీయాలన్నీ కేంద్రబిందువుగా మారిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు వ్యవహారానికి తెర పడట్లేదు. ఈ హెల్త్ యూనివర్శిటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తప్పు పడుతోంది. టీడీపీతో పాటు భారతీయ జనతా పార్టీ, జనసేన.. దీనిపై స్పందించాయి. టాలీవుడ్ నుంచి కూడా విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తిప్పి కొడుతున్నారు.
కొనసాగుతున్న ఎదురుదాడి..
మంత్రులు, మాజీ మంత్రులు- టీడీపీ విమర్శలపై ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు తాజాగా ఎన్టీ రామారావు భార్య, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ను ఆయన వారసులే చంపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్కు చెడ్డ పేరు తీసుకుని రావడానికి చంద్రబాబు పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
వుయ్ డోన్ట్ నీడ్ ఎన్టీఆర్ అంటూ..
ఈ పరిణామాల మధ్య విజయవాడలో కొత్తగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. వైస్రాయ్ కుట్ర సమయంలో చంద్రబాబు- ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశానికి సంబంధించిన పోస్టర్లు అవి. ఈ ఇంటర్వ్యూను దక్కన్ క్రానికల్ పతాక శీర్షికన ప్రచురించింది. ఆ పేపర్ క్లిప్పింగ్కు చెందిన పోస్టర్లు ఇప్పుడు తాజాగా విజయవాడ వ్యాప్తంగా కనిపిస్తోన్నాయి. విజయవాడలో రద్దీ ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి.
పేరు మార్పు వివాదం వేళ..
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వివాదం చెలరేగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడలో ఈ పోస్టర్లు వెలుగులోకి వచ్చాయి. వీటిని ఎవరు అతికించారనేది మొదట్లో తెలియరాలేదు. ఎన్టీఆర్ సానుభూతిపరులు వీటిని ఏర్పాటు చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ పేరు మార్పు వ్యవహారంలో టీడీపీ నాయకులు అటు జూనియర్ ఎన్టీఆర్ను కూడా టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తోండటంతో ఆయన అభిమానులైనా ఈ పోస్టర్లను తెర మీదికి తెచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.
సస్పెన్స్కు తెర..
ఈ సస్పెన్స్కు తెర పడింది. ఆ పోస్టర్లను అంటించింది తామేనని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నందమూరి తారక రామారావు అభిమాన సంఘం వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ నాయకులు అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తోన్నారని, దీన్ని ఎదుర్కొనడానికే తాము ఈ పోస్టర్లను అంటించామని సంఘం ప్రతినిధులు కావూరి కృష్ణ, నున్న గణేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వారసుడని స్పష్టం చేశారు.
చంద్రబాబు కుట్ర తెలియాలనే..
చంద్రబాబు నీచ చరిత్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తాము ఈ పోస్టర్లను విజయవాడలో అతికించామని కావూరి కృష్ణ, నున్న గణేష్ తెలిపారు. ఎన్టీఆర్ మీద ఎన్నో కుట్రలు చేశారని, ప్రజాస్వామ్యం పేరుతో ఆయన స్థాపించిన పార్టీని అక్రమంగా లాక్కున్నారని, ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారని ధ్వజమెత్తారు. ఆవన్నీ ఈ తరం వారికి తెలియజేయాలనే కారణంతోనే ఎన్టీఆర్ జిల్లాలో వాటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.