ఎన్టీఆర్కు లౌక్యం తెలియదు, అందుకే అలా: బాలకృష్ణ
హైదరాబాద్/ విజయవాడ: తమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తన తండ్రి ఎన్టీ రామారావుకు రాజకీయాల్లో లౌక్యం తెలియదని, అందుకే అసాధ్యమనుకున్న పథకాలను అమలు చేశారని శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ అన్నారు. ప్రజలకు మంచి చేయడం మాత్రమే ఎన్టీఆర్కు తెలుసని ఆయన అన్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ తనకు ఆదర్శమని బాలకృష్ణ చెప్పారు. దేశంలో విప్లవాత్మక పథకాలు ప్రారంభించింది ఎన్టీఆరేనని స్పష్టం చేశారు. ఆయన పథకాలకే ఇప్పుడు పేర్లు మారుస్తున్నారని బాలకృష్ణ తెలిపారు.
ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్విప్మెంట్
అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్విప్మెంట్ను సమకూరుస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 1 నుంచి ఎన్టీఆర్ పథకం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

కాన్పు తర్వాత తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ పథకాన్ని ప్రవేశపెడుతామని ఆయన తెలిపారు. బాలింతలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా టోల్ఫ్రీ నెంబర్ 102కు ఫోన్ చేయవచ్చని మంత్రి కామినేని చెప్పారు.
టిడిపి మోసం చేస్తోంది...
అమలుకానీ హామీలు ఇచ్చి ప్రజలను తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలన్నారు.
స్థానిక సంస్థలను జన్మభూమి కమిటీలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. కుంభకోణంలో భాగమే తాత్కాలిక సచివాలయం నిర్ణయమన్నారు. రైతుల భూములతో ప్రభుత్వం రియల్ దందా చేస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications