గవర్నర్ వ్యవస్థ: నాడు ఎన్టీఆర్ అలా, నేడు చంద్రబాబు ఇలా..
హైదరాబాద్: చేతులు మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ విధానాల్లో కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. గవర్నర్ వ్యవస్థపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నిరంతరం సమరం సాగించారు. గవర్నర్ వ్యవస్థను పనికి మాలిందిగా, కేంద్రం పెత్తనం చేయడానికి పనికి వచ్చేదిగా ఆయన అభివర్ణిస్తూ వచ్చారు. రాష్ట్రాల హక్కులను గవర్నర్ వ్యవస్థ ద్వారా కేంద్రం కాలరాయాలని చూస్తోందని అన్నారు.
నిజానికి, ఎన్టీ రామారావు భారతదేశాన్ని ఫెడరల్ వ్యవస్థగా భావించారు. కేంద్రంలో యూనియన్ గవర్నమెంట్ కాకుండా ఫెడరల్ ప్రభుత్వం ఉండాలని ఆయన ఆశించారు. తన ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర రావు ద్వారా కూల్చడానికి గవర్నర్ వ్యవస్థను ఆనాటి కేంద్ర ప్రభుత్వం వాడుకుందని ఆయన ఆరోపించారు. ఓ విధానంగానే ఎన్టీ రామారావు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ వచ్చారు.
ఇప్పుటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఉమ్మడి గవర్నర్ ఆధిపత్యం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి, సెక్షన్ 8లో గవర్నర్కు అసాధారణమైన అధికారాలు ఏవీ కట్టబెట్టలేదు. కానీ, దాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆయన ఉద్దేశం గానీ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఉద్దేశం గానీ - ఓటుకు నోటు కేసులో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, దానికి సెక్షన్ 8ను వర్తింపజేయాలని అయి ఉంటుందని చెప్పవచ్చు.

ఎన్టీ రామారావు విధానాన్నే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందుకు తేవడానికి వ్యూహరచన చేస్తున్నారు. అయితే, సెక్షన్ 8 అమలు అంటూ గవర్నర్ చేతికి పగ్గాలు ఇస్తే, కేంద్ర ప్రభుత్వంపై ఆ వ్యూహాన్ని అమలు చేయడానికి ఆయన సిద్ధపడినట్లు అర్థమవుతోంది.
నిజానికి, ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చిన సమయంలో గవర్నర్ వ్యవస్థపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. గవర్నర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయిస్తుందనే విమర్శలు వచ్చాయి. దాన్నే గవర్నర్ల వ్యవస్థను వ్యతిరేకించడానికి ఎన్టీఆర్ ఆయుధంగా వాడుకున్నారు.












Click it and Unblock the Notifications