ఎన్టీఆర్ టీడీపీ కోసం పనిచేయాలంటూ ... గోరంట్ల నోట జూనియర్ ఎన్టీఆర్ మాట
తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు టిడిపి గొప్పతనాన్ని, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమైన నేపథ్యాన్ని, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
జబర్దస్త్ కామెడీ షోలా వైసీపీ పాలన, జగన్ హయాంలో ప్రజలు సోమరిపోతులుగా: పరిటాల శ్రీరామ్ ధ్వజం
జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కోసం పని చేయాలన్న గోరంట్ల
రాజమండ్రిలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. టిడిపి శ్రేణులు ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. ఇక ఇదే సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కోసం పని చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు.
గ్రౌండ్ రియాలిటీ ప్రకారం తెలుగుదేశం పార్టీలో కొత్త నాయకత్వం రాబోతుంది
గ్రౌండ్ రియాలిటీ ప్రకారం తెలుగుదేశం పార్టీలో కొత్త నాయకత్వం రాబోతుందని ఆయన స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి ఈరోజు 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నదని , ఈ నలభై ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైసిపి దమనకాండను కూడా ధైర్యంగా ఎదుర్కొంటోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు టీడీపీ నేతలు, యువ నాయకత్వం పార్టీని బలోపేతం చేయడానికి కృషిచేయాలని బుచ్చయ్య చౌదరి తెలిపారు.
రాష్ట్రం అప్పుల కుప్పగా .. ఆర్ధిక స్థితి దినదిన గండంగా
ఇదే సమయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చూస్తే దినదినగండంగా కనిపిస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని కేంద్రం చెప్తే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకొని వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగిస్తుందని పేర్కొన్నారు . ఇక ముందు రైతులు బిల్లులు చెల్లిస్తే తరువాత ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతున్న నేపథ్యంలో రైతులు చెల్లించిన బిల్లుల నగదు వారి ఖాతాలో జమ చేయడం ప్రభుత్వానికి సాధ్యమవుతుందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇదే సమయంలో వైజాగ్ లో రాజధాని ని ఎలా నిర్మిస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.