బర్త్డే నాడే రఘురామకు షాకిచ్చిన జగన్.. హైదరాబాద్ పోలీసులకూ ఎంపీపై ఫిర్యాదు.. దౌర్జన్యం అంటున్న ఫ్యామిలీ
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. తాజాగా హైదరాబాద్లోని ఓసీ సంక్షేమ సంఘం రఘురామ కృష్ణంరాజుపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో,పలు టీవీ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో ఎంపీ రఘురామ కులం పేరుతో రెడ్లను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టరీత్యా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మంగళగిరికి తరలింపు...
శుక్రవారం(మే 14) సాయంత్రం హైదరాబాద్లోని రఘురామ నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడినుంచి ఏపీలోని మంగళగిరి సీఐడీ కార్యాలయానికి ఆయన్ను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా రఘురామకృష్ణం రాజు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై కుట్రపూరిత ధోరణిలో వ్యాఖ్యలు చేస్తున్నారని సీఐడీ పోలీసులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అలాగే కులాలు,మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

రఘురామపై ఏయే సెక్షన్లు...
ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ పోలీసులు రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. రఘురామపై 124(A),154(A),120(B),505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 50 కింద రఘురామ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రఘురామ కుటుంబ సభ్యులు మాత్రం సీఐడీ అధికారులు దౌర్జన్యంగా రఘురామను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. 60 ఏళ్ల వయసులో,ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి పట్ల ఏపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఇవాళ తన తండ్రి పుట్టినరోజు కూడా అని చెప్పారు. మఫ్టీలో వచ్చిన 20-30 మంది దౌర్జన్యంగా ఆయన్ను లాక్కెళ్లారని... వాళ్లు మనుషులా,ఇంకేమైనా అని మండిపడ్డారు.
Recommended Video

రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని...
ఇటీవల రఘురామ కృష్ణం రాజు 'రెడ్డి' కమ్యూనిటీపై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు అది కులమే కాదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి కుల సర్టిఫికెట్లో 'కాపు' ఉంటే ఆయన రెడ్డి ఎలా అయ్యారని విమర్శించారు. రఘురామ విమర్శలపై నటి శ్రీరెడ్డి తీవ్ర స్థాయిలో దూషణలు చేయడంతో... ఆయన కూడా అంతే స్థాయిలో రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. రెడ్ల కుల దేవత,శృంగార నటి,గుడ్డలు విప్పి దీక్షలు చేసే తార అంటూ రఘురామ ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన రెడ్లను కించపరిచారన్న ఆరోపణలతో తాజాగా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు అందింది.












Click it and Unblock the Notifications