ఏపీలో అక్టోబర్ 1 పెన్షన్లపై ఉత్కంఠ ? తేల్చని సచివాలయ ఉద్యోగులు..!
ఏపీలో సచివాలయ ఉద్యోగులు తమ పెండింగ్ డిమాండ్లపై ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఇవాళ్టి నుంచి నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు 15 రోజుల ముందే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు. అనంతరం సచివాలయాల శాఖ మంత్రికి, తాజాగా మరోసారి అధికారులకు రిమైండర్ నోటీసులు కూడా ఇచ్చారు. వీటిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. దీని ప్రభావం అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీపై పడేలా ఉంది.
సచివాలయ ఉద్యోగులు తాము ప్రకటించిన నిరసనల షెడ్యూల్ లో అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీ యథావిథిగా చేస్తామనే ప్రకటించారు. అయితే సచివాలయ ఉద్యోగుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీని ఆపితే కానీ ప్రభుత్వం దిగిరాదని భావిస్తున్నారు. దీనిపై జేఏసీతో విభేదించేందుకు సిద్దమవుతున్నారు. అలాగే సచివాలయ ఉద్యోగ సంఘాల్లో జేఏసీ మినహా ఇతర సంఘాలు కూడా ఇదే వాణి వినిపిస్తున్నాయి.

మరోవైపు అక్టోబర్ 1న జరగాల్సిన సెప్టెంబర్ పెన్షన్ల పంపిణీని ఆపేసి నిరసన తెలిపితే తమపై వ్యతిరేకత వస్తుందని ఉద్యోగుల్లో కొందరు భయపడుతున్నారు. ప్రభుత్వంపై నిరసనలకు వెళ్తే క్షేత్రస్ధాయిలో తమపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి పెన్షన్ల పంపిణీ వరకూ పట్టు సడలించాలని కోరుతున్నారు. ఇంకొందరు మాత్రం అసలు పెన్షన్ల పంపిణీ మాత్రం ఆపొద్దని కోరుతున్నారు. దీంతో పెన్షన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ గతంలో వాలంటీర్లు పంపిణీ చేసే పెన్షన్లను సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. దీంతో పెన్షన్ల సొమ్ము దుర్వినియోగం, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పింది. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు సైతం నిరసన పేరుతో పెన్షన్లు చెల్లించకుండా ఆపితే ఆ ప్రభావం కచ్చితంగా ప్రభుత్వంపైనా పడనుంది. అప్పుడు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలకు వెళ్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications