కొత్త జిల్లాల ఏర్పాటు - సమస్యలు : నేడే కీలక నిర్ణయం : ఉద్యోగులపై ఏం చేద్దాం..!!
ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే 26 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. వీటి పైన నెల రోజుల సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. అయితే, ఇదే సమయంలో కొత్త జిల్లాల పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీలు సమావేశం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో ఆ సంఖ్య 26కు పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసారు. దీని పైన ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఆ తరువాత తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. అయితే, ఈ సమయంలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో పాలనా పరమైన ఏర్పాట్లు.. ఉద్యోగుల సర్దుబాటు వంటి అంశాల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది.
మౌళిక వసతుల పై ఫోకస్
అందులో భాగంగా మౌళిక వసతుల కల్పన పై కలెక్టర్ల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు సేకరించారు. దీంతో.. అనేక అంశాల పైన చర్చించనున్న ఈ కమిటీలు భేటీ అయి వీటి పైన ప్రతిపాదనలు సిద్దం చేయనున్నారు. ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం అవుతారు. కొత్తగా ప్రతిపాదించిన రెవిన్యూ డివిజన్ల పైన ఈ కమిటీ సభ్యులు ఫోకస్ పెట్టనున్నారు.
కొత్తగా ప్రతిపాదించిన 13 జిల్లాల్లో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులతోపాటు ఇతర విభాగాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. చాలా చోట్ల రెవెన్యూ డివిజన్ కేంద్రాలే ఆయా కొత్త జిల్లాలకు హెడ్క్వార్టర్స్గా ప్రతిపాదించారు. కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల ముఖ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు..వనరుల పైన సమాచారం సేకరించారు.
జిల్లా కార్యాలయాలు..అధికారుల కేటాయింపు
అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లో కొద్దిపాటి వనరులతోనైనా కలెక్టరేట్లను ప్రారంభించాలని ప్రణాళికా శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఆర్అండ్బీ అధికారులు ఏడు జిల్లాల పరిధిలో భవనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. తెలిసింది. అవసరమైతే ప్రైవేటు విద్యాసంస్థల భవనాలను కూడా తీసుకోవాలని భావిస్తున్నారు.
ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించే అంశంపైనా ఈ భేటీలో చర్చించి...సీఎస్ కు ప్రతిపాదనలను నివేదించనున్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లలో ప్రభుత్వ విభాగాలను నెలకొల్పాలి. ఇందుకు ఆయా శాఖల పరిధిలో ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి ఉంది. ఉద్యోగుల విభజన ఎలా చేయాలన్న విషయంపై ఆ కమిటీ కొంత కసరత్తు చేసినట్లు తెలిసింది.
ఉద్యోగుల సర్దుబాటు...సమ్మె ప్రభావం
విభజన ఎలా ఉండాలనే అంశంలో ఎలా ముందుకెళ్లాలనేది దాని పై ఈ రోజు జరిగే భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఉద్యోగులకు ఆప్షన్లు... సీనియార్టీ ఆధారంగా పోస్టుల విభజన.. ఉద్యోగుల మర్పు వంటి అంశాల్లో తీసుకోవాల్సిన ప్రాధమిక అంశాల పైన చర్చించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో జిల్లాల పెంపు సమయంలో ఏ విధంగా వ్యవహరించారు... తక్కువ ఖర్చు... వివాదాలకు అవకాశం లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయటం పైన కమిటీలు ప్రభుత్వానికి సూచనలు చేయనున్నాయి.
ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో..ఈ రోజు జరిగే సమావేశం కీలకం కానుంది. ఇదే సమయంలో ఉద్యోగులు సమ్మె బాట పట్టటంతో కొత్త జిల్లాల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లటంలో ఎటువంటి ప్రభావం చూపుతుందనే అంశం పైన అధికారులు ఆలోచన చేస్తున్నారు.