భవానీ దీక్షల విరమణ వేళ కీలక నిర్ణయాలు - అందుబాటులోకి కొత్తగా..!!
భవానీ దీక్షల విరమణకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తు న్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు భవానీ దీక్షల కార్యక్రమం జరగనుంది. ఇందు కోసం తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు.
దీంతో, భక్తుల కోసం భవానీ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. దర్శనం, ప్రసాదం ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
భక్తుల కోసం ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్ష విరమణ కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు రోజుకు లక్ష మంది వరకు భక్తులు వస్తారని.. మొత్తంగా ఆరు లక్షల మంది అమ్మ వారి దర్శనం కోసం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రెవిన్యూ, పోలీసు అధికారులు ఆలయంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్ల పైన సమీక్ష చేసారు. దర్శనం సులభతరం చేయటానికి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.
కొత్తగా తెచ్చిన యాప్ ద్వారా భక్తులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండనుంది.

యాప్ లో పూర్తి సమాచారం
యాప్ లో క్యూ లైన్ల ఏర్పాట్లు వెయింటిగ్ హాళ్ళు, పార్కింగ్ స్థాలాలు, లడ్డూప్రసాదం, అన్న ప్రసాదాల పంపిణీ వంటి వివరాలు భక్తులకు పూర్తి సమాచారం నిక్షిప్తం అయి ఉంటుంది. దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్షా విరమణలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మూడు హోమ గుండాలు ఏర్పాటు చేయనున్నామని.. అదే విధంగా సీతమ్మవారి పాదాలు, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ వద్ద మొత్తం 800 వరకు షవర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత అనభవాలను దృష్టిలో ఉంచుకొని లడ్డూ ప్రసాదానికి కొరత లేకుండా ఈసారి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు.
ఆన్ లైన్ లో దర్శనం - ప్రసాదం
ఆధ్యాత్మిక వాతావరణంలో దీక్షా విరమణలు జరిగేలా వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తున్నామన్నారు. దీక్ష విరమణకు వచ్చే భక్తులు వారి ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దర్శనం, ప్రసాదాలను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి. దీంతో, ఈ నెల 21వ తేదీ నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications