పైప్లైన్ తుప్పుపట్టడం వల్లే.., బాబుతో వస్తానని ధర్మేంద్ర
న్యూఢిల్లీ/రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో నగరం గ్రామంలో గ్యాస్ పైప్లైన్ పేలి భారీ శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పద్నాలుగు మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి నాణ్యత లేని పైపులు, తుప్పు పట్టిన పైపులే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రమాదంపై యనమల
ప్రమాదం పైన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... గ్యాస్ పైప్ లైన్ తుప్పు పట్టి పాడైందని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పేలుడు ఘటనకు సంబంధించి బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నుండి నివేదిక కోరినట్లు చెప్పారు. పది ఎకరాల కొబ్బరి తోటలు దగ్ధమయ్యాయని చెప్పారు.
ప్రమాదంపై తోట నర్సింహం
గ్యాస్ పైప్ లైన్లో నాణ్యత లేని పైపులు వాడడం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని కాకినాడ ఎంపీ తోట నర్సింహం అన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడారు. ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పెట్రోలియం శాఖకు విజ్ఞప్తి చేశారు.
ప్రమాదంపై హర్ష కుమార్
పైప్ లైన్లు తుప్పు పట్టాయని ఎప్పటి నుండో చెబుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా కొత్త పైప్ లైన్లను వేయాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి గెయిల్ వారిదే బాధ్యత అన్నారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. పైప్ లైన్ల పునర్ నిర్మాణం చేపట్టాకనే కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
విచారణ కమిటీ వేశాం: ధర్మేంద్ర ప్రధాన
తూర్పు గోదావరి జిల్లా గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటన పైన విచారణ కమిటీ వేసినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఆయన ఢిల్లీలో మాట్లాడారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భద్రత పైన నిర్ధిష్టమైన వ్యవస్థ లేదనన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద ఘటన వివరాలు ఎప్పటికి అప్పుడు ప్రధానికి వివరిస్తున్నామన్నారు. గెయిల్ చైర్మన్, పెట్రోలియం శాఖ కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఘటన స్థలికి వెళ్తానని చెప్పారు.