బాబు మాట!: ఏపీలో ఓలా క్యాబ్స్ 150 కోట్ల పెట్టుబడి, అమరావతి నుంచి.. కేంబ్రిడ్జ్ ఒప్పందం
న్యూఢిల్లీ: ట్యాక్సీ వ్యాపారంలో దూసుకుపోతున్న 'ఓలా' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని ఓలా క్యాబ్స్ బుధవారం నాడు ప్రకటించింది. తాము ఏపీ ప్రభుత్వంతో లింకప్ అవుతామని చెప్పింది.
రూ.150 కోట్ల పెట్టుబడి పెడతామని, రానున్న మూడేళ్లలో 40,000 వాహనాలు రోడ్డెక్కిస్తామని చెప్పింది. ఓలా క్యాబ్ ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా డ్రైవర్ సహా పలు ఉద్యోగాలు యువతకు దొరుకుతాయని అభిప్రాయపడింది.
ప్రస్తుతం, ఓలా క్యాబ్స్ ఏపీలో 10,000 వాహనాలు కలిగి ఉంది. ఎంవోయు ప్రకారం రానున్న మూడేళ్లలలో ఈ వాహనాలను 50,000కు పెంచనుంది. స్మార్ట్ అండ్ మోడర్న్ ఏపీలో తాము భాగస్వాములం అవుతామని ప్రకటించారు.
సాంకేతికత అభివృద్ధిలో రవాణా కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. క్యాబ్స్కు మొబైల్ టెక్నాలజీ తోడుగా ఉంది.
దీంతో, ఓలా క్యాబ్స్ వందలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు, అవసరమైన వారికి సమర్థవంతమైన, సమయపాలనతో సేవలు చేస్తామని చెబుతున్నారు.
ఓలా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రణయ్ జివ్రాజ్క మాట్లాడుతూ... ఓలా రూ.150 కోట్ల పెట్టుబడిని రాష్ట్రంలో (ఏపీ) పెడుతుందన్నారు. 2014 నుంచి ఓలా క్యాబ్స్ ఏపీలో నడుస్తున్నాయి. విజయవాడ, విశాఖ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతిల్లో ఉన్నాయి.
అమరావతి నుంచి కేంబ్రిడ్జి కార్యకలాపాలు: సుజనా చౌదరి
ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్శిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాల ప్రారంభానికి కేంబ్రిడ్జి అంగీకరించినట్లు తెలిపారు.
సెక్షన్-8 సంస్థలు, లాభాపేక్షలేని కార్యకలాపాలను కేంబ్రిడ్జి ప్రారంభించనన్నట్లు సుజనా చౌదరి వెల్లడించారు. విద్య, నూతన ఆవిష్కరణలపై కేంబ్రిడ్జి యూనివర్శిటీ సేవలు అందిస్తుందన్నారు.