ఇంతవరకు ఏ ఒక్కడు రాలేదు, మహానుభావుడు.. ఎక్కడైనా మాట్లాడతా: పవన్పై వృద్ధురాలు
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జనసేన పోరాట యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటూ, గిరిజన గ్రామాలను సందర్శిస్తూ, గిరిజన యువతతో భేటీ అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు. ఆయనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
Recommended Video
గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ విశ్వాసం నింపుతున్న జనసేనాని: పాడేరులో షాక్, వారి హెచ్చరిక
ఇందులో భాగంగా అరకు ఏజెన్సీలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా కురిది గ్రామంలో ఓవృద్ధురాలు జనసేనానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాకు మేలు చేస్తాడనే గట్టి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ ముఖ్యమంత్రి కూడా అవుతారని ఆమె జోస్యం చెప్పారు.
ఈ మహానుభావుడు వచ్చాడు
ఇప్పటి వరకు ఏ ఒక్కడు తమ ఊరికి వచ్చి కష్టసుఖాలు అడగలేదని, కానీ ఈ బాబు వచ్చి అడిగాడని జనాలు చెబుతున్నారని, అతడు తప్పకుండా తమకు మేలు చేస్తాడని ఆ వృద్ధురాలు అన్నారు. దండం పెడుతున్నానని, ఈ మహానుభావుడు వచ్చాడని, ఎక్కడ మాట్లాడమన్నా నేను మాట్లాడటానికి సిద్ధమని, తనకు ఏం భయం లేదని ఆమె అన్నారు. పవన్ సీఎం అవుతాడన్న నమ్మకం ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఆల్బమ్ వీడియో
ఈయన (పవన్ కళ్యాణ్) ఏమైనా చేస్తాడా అని ఒకరు అడగగా.. చేస్తాడని, తనకు నమ్మకం ఉందని ఆ వృద్ధురాలు అన్నారు. ఆమె వీడియోకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు దీనిని రీట్వీట్ చేయడంతో పాటు, ఆ వీడియో కావాలని జనసేన శతగ్నిని అడిగారు. దీనికి ఆ వీడియోను ఎక్కడి నుంచి తీసుకోవాలో కూడా చెప్పారు. శతగ్ని చానల్కు సబ్ స్క్రైబ్ అయి అందులో నుంచి డౌన్ లౌడ్ చేసుకోవచ్చునని చెబుతున్నారు. వృద్ధురాలి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఓ అభిమాని పవన్ ఫోటోలతో ఓ వీడియో పోస్టు చేశారు.
లోతుల్లోకి వెళ్తున్న పవన్ కళ్యాణ్
మనుషులు వేరైనా ఆలోచన ఒక్కటే, దారులు వైరేనా గమ్యం ఒక్కటే, గుండె వేరైనా చప్పుడు ఒక్కటే అంటూ మరో అభిమాని మహాత్మా గాంధీ, పవన్ కళ్యాణ్ ఫోటోలను పోస్టు చేశారు. నలబై ఏళ్ల అనుభవం ఉన్న సీఎం వెళ్లని చోట్లకు పవన్ ఆరంగేట్రంలోనే వెళ్తే ఇంకా ముందు ముందు ఏం చేయగలడో చూసుకోండని, డబ్బు ఖర్చు పెట్టి భారీ సెట్టింగులతో మీడియాను మేనేజ్ చేసి జనాల దృష్టిలో పడటం కాదని, సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి భరోసా కల్పించాలని మరొకరు పేర్కొన్నారు.
ఏజెన్సీలో పవన్ కళ్యాణ్
కాగా, ఏజెన్సీలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడి గిరిజన యువతీయువకులతో సమావేశం నిర్వహించి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. వారు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. గర్భిణులు పడుతున్న అవస్థలు చూసి కరిగిపోయారు. వైద్యం అందక వారు పడుతున్న కష్టాలపై స్పందించారు. వారి సమస్యకు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.