వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్: ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్; జగన్ కీలక ఆదేశాలు
భారత దేశంలో భారీగా కరోనా కేసులు తగ్గడంతో కరోనా మహమ్మారి బారి నుండి ఉపశమనం దొరికిందని కాస్త ఊపిరి తీసుకుంటున్న సమయంలోనే పిడుగులాంటి వార్త మళ్లీ ప్రజలను బెంబేలెత్తిస్తోంది.కరోనా కొత్త రూపం తీసుకుందని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విరుచుకు పడుతుందని, డెల్టా వేరియంట్ కంటే ఇది డెడ్లీ వైరస్ అని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని హెచ్చరికలు జారీ చేస్తోంది.

భారత్ కు ఒమిక్రాన్ భయం .. అలెర్ట్ అయిన సర్కార్
ఇదే సమయంలో భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే వివిధ దేశాల నుండి వచ్చే విమాన రాకపోకలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న భారత్, ఇతర దేశాల నుండి భారతదేశానికి వచ్చిన వారికి క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి తగిన చర్యలు చేపడుతోంది. ఇదే సమయంలో రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాప్తి చాలా ఉధృతంగా ఉంటుందని, అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ పై సీఎం జగన్ సమీక్షా సమావేశం
దీంతో సెకండ్ వేవ్ సమయంలో బాగా తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ పై అలర్ట్ అయింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వ్యాక్సినేషన్ మరింత ఉధృతం చేయాలని, వీలైనంత త్వరగా కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్లను ఉపయోగించాలని జగన్ పేర్కొన్నారు. అంతేకాదు కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ మాస్కు ధరించేలా చూడాలని, సామాజిక దూర నిబంధనలు పాటించడంపై జాగ్రత్త వహించాలని సీఎం జగన్ సూచించారు. కరోనా కట్టడికి తగిన చర్యలు ఇప్పటినుండే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కరోనా నిబంధనలు అమలు చెయ్యాలి; ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లు రెడీ చెయ్యాలి
మాస్కుల విషయంలో మళ్లీ డ్రైవ్ నిర్వహించాలని, గతంలో అమల్లో ఉన్న నిబంధనలను మళ్లీ అమలు చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా, ఫీవర్ సర్వే లు కూడా చెయ్యాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ఆసుపత్రిలో ఆక్సిజన్ పైపులైను సరిగా ఉన్నాయా లేవా? డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా అన్నది పరిశీలించాలని వెల్లడించారు. కోవిడ్ కాల్ సెంటర్ లను తిరిగి పరిశీలించాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా 104 కాల్ చేస్తే వైద్యం అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఎంప్యానెల్ ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ కాల్ సెంటర్లను తిరిగి సిద్ధం చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్ పై జగన్ సూచనలు, ఎయిర్ పోర్ట్ లలో స్పెషల్ మెడికల్ టీమ్స్
డిసెంబర్ నెలాఖరుకల్లా రెండు కోట్ల వ్యాక్సిన్ డోసులను పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకొని అధికారులు పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ మెడికల్ టీమ్స్ ను ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయాలని జగన్ తెలిపారు. ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ లు మాత్రమే చేయాలని, ర్యాపిడ్ టెస్ట్ ల తో సరి పెట్టవద్దని సీఎం జగన్ తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లు మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు.
Recommended Video

ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవటానికి రెడీగా ఉండండి
ఒమిక్రాన్ వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పోరాటం చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ వైద్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి పొంచివున్న పెనుముప్పు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications