అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తిరుమల ఆలయం నుండి లక్ష లడ్లు ప్రసాదం!!
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరపటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తో పాటు విగ్రహ ప్రాణ ప్రతిష్టకు దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరు కానున్నారు. 2500 సంవత్సరాలు నిలిచి ఉండేలా ఈ అద్భుత కట్టడాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామాలయం నిలవనుంది. అటువంటి అయోధ్య రామాలయానికి తెలుగు రాష్ట్రాల నుండి అనేక కానుకలు అందుతున్నాయి.
ఇప్పటికే అయోధ్య రామయ్య పాదుకలను హైదరాబాద్ నుండి తయారు చేయించి పంపిస్తే, అయోధ్య మందిర ద్వారాలు కూడా మన హైదరాబాద్ లోనే రూపు దిద్దుకున్నాయి. అయోధ్య రామాలయానికి 118 దర్వాజాలు హైదరాబాద్ బోయినపల్లి లోని అనురాధ టింబర్ డిపోలో తయారు చేయించారు. సీతారామ చంద్రుడికి అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ సుమారు రూ.1.03 కోట్ల విలువైన బంగారం పాదుకలను రామయ్యకు పంపించింది.

ఇదిలా ఉంటే అయోధ్య రామాలయ ప్రారంభానికి తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపనున్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్డు ప్రసాదాలు పంపిస్తున్నట్లు టిటిడి ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఫిబ్రవరి 3వ తేది నుంచి 5వతేదీ వరకు పీఠాధిపతులు,మఠాధిపతులు ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నట్లు కూడా టిటిడి ఇఓ ఎ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ టిటిడి ఇఓ కార్యక్రమం ఈరోజు జరుగగా భక్తుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని అలిపిరి వద్ద ప్రతి నిత్యం నిర్వహిస్తున్న శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొన్న భక్తులుకు సుపథం ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.
ఈనెల 15వ తేదీన తిరుపతిలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తామని..16వ తేదిన తిరుమలలో పార్వేటి ఉత్సవం నిర్వహిస్తున్నామన్నారు. గడిచిన డిసెంబర్ నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి 19.16 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు చెప్పారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.116.73 కోట్లు లభించిందన్నారు. 1 కోటి 46 వేల లడ్డూలు భక్తులకు విక్రయించినట్లు చెప్పారు. డిసెంబర్ నెలలో 6.87 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు.












Click it and Unblock the Notifications