క్రిష్ణా జిల్లాలో టీడిపి కి మరో కుదుపు..!వైసీపి తీర్థం పుచ్చుకోనున్న గన్నవరం ఎమ్మెల్యే..!!
అమరావతి/ హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఏపిలో సంస్థాగతంగా బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా నేతల మద్య తీవ్ర స్ధాయిలో అసంత్రుప్తి ఉన్నట్టు తెలుస్తోంది. టీడిపి అదిష్టానం తీరు నచ్చక చాలా మంది తమ్ముళ్లు పార్టీ మారేందుకు సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా! ఈ మేరకు జగన్తో చర్చలు జరిగాయా! మార్చి మొదటివారంలో పార్టీ కండువా కప్పుకుంటాడా! ఇదే నిజమైతే కృష్ణాజిల్లాలో టీడీపీ కి మరో "కమ్మ"ని దెబ్బ తప్పదని చర్చ జరుగుతోంది.
క్రిష్ణ జిల్లాలో జగన్ వ్యూహాత్మక రాజకీయం..! పార్టీ మారబోతున్న మరో తెలుగు తమ్ముడు..!!
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయాలు నెరుపుతున్నారు. ఏపీ రాజకీయాలను ఔపాసన పట్టిన జగన్.. ఈ సారి కుల సమీకరణ విషయంలో స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కడ.. ఏ కులానికి పట్టుంది.. ఏ కుల నేతలు జిల్లాను ప్రభావితం చేయగలరనే అంశాలపై క్లారిటీకు వచ్చిన జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పైగా కాపు కోటరీ తనవైపు ఉందనే విషయాన్ని ఆమంచి అవంతి రాకతో నిజమైందనేలా నమ్మకాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే ఎత్తుగడతో కమ్మవర్గానికి గాలం వేస్తున్నారు. ఫలితంగా అటు లావు రత్తయ్య ఫ్యామిలీ, ఇటు జయరాం రమేష్ కుటుంబం.. తాజాగా వల్లభనేని వంశీను తమ వైపునకు తిప్పుకుంటున్నాడు.
"కమ్మ"ని మార్పులపై జగన్ కన్ను..! టీడిపి ని బలహీన పరచడమే వైసీపి లక్ష్యం..!
మరికొద్దిరోజుల్లో గుంటూరులోని ప్రధానమైన కమ్మ కుటుంబానికి చెందిన నేతలు జగన్తో కలవబోతున్నట్లు సమాచారం. ఇటీవల కృష్ణ సోదరుడు ఘట్టమనేని శేషగిరిరావు ఒక్కడు సైకిల్ ఎక్కడంతో.. దానికి ప్రతిగా... అదే వర్గం నుంచి ముగ్గురు నేతలను ఫ్యాన్ రెక్కల కిందకు రప్పించాడు జగన్. గుడివాడలో వైసీపీ నేతగా కొడాలి నాని ఉండటాన్ని కమ్మవర్గంలో ప్రధాననాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా సైకిల్ దిగి జగన్ పంచన చేరితే.. రాజకీయం తారుమారవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
వంశీని పట్టించుకోని సీనియర్లు..! ఏకాకిగా ఎందుకు ఉండాలంటున్న యువ ఎమ్మెల్యే..!!
వాస్తవానికి వల్లభనేని వంశీతో ఇటు కేశినేని నాని, బుద్దావెంకన్న, దేవినేని ఉమా, దేవినేని అవినాష్ ఎవ్వరూ సఖ్యతగా మెలగరు. వల్లభనేని అందరితో కలుపుగోలుగా ఉండటాన్ని తప్పుబడుతుంటారని ప్రచారం సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్తో సినిమాలు తీసిన స్నేహంతో జూనియర్ ఎన్టీఆర్ను కలసినా టీడీపీ శ్రేణులు తప్పిదంగానే భావిస్తున్నాయి. గన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటనకు వచ్చినా వంశీకు పిలుపులేని ఘటనలు ఎన్నోఉన్నాయట.
మార్చిలో పార్టీ మార్పు..! ముహూర్తం కోసం చూస్తున్న వంశీ..!!
కనీసం ప్రోటోకాల్ ప్రకారం తనకు ఐదేళ్లలో గౌరవం దక్కలేదంటూ వంశీ సన్నిహితుల వద్ద తరచూ ఆవేదన వెలిబుచ్చేవారట. ఈ నేపథ్యంలోనే ఒకసారి వంశీ వైసీపీ అధినేత జగన్ను కలవటం మరింత కష్టాలను పెంచిందట. ఇన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటూ నెట్టుకువచ్చిన వంశీను ఇప్పుడు ఈ సారి గన్నవరం సీటు మరో నేతకు ఇవ్వబోతున్నారనే వార్త కూడా మనోవేదనకు గురిచేసిందట. వీటన్నింటి మధ్య ఇమడలేక పార్టీ మారాలనే నిర్ణయానికి వల్లభనేని వచ్చినట్టు తెలుస్తోంది.