వైసీపీకి మరో షాక్! గిడ్డి ఈశ్వరి దారిలో కర్నూలు నేత? టీడీపీలో చేరికకు రంగం సిద్ధం?
కర్నూలు: ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇచ్చిన షాక్ మరువకముందే వైసీపీకి మరో షాక్ తగిలింది. త్వరలోనే పసుపు కండువా కప్పుకునేందుకు మరో వైసీపీ నేత రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Recommended Video
కర్నూలు జిల్లా వైసీపీ నేత రామచంద్రారెడ్డి త్వరలో పార్టీ మారబోతున్నారని విశ్వసనీయ సమాచారం. రామచంద్రారెడ్డికి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్వయానా బావ. 2014 ఎన్నికల్లో రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఎస్.నాగరత్నమ్మ నాటి వైసీపీ అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డి గెలుపు కోసం పని చేశారు.
ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ సమీకరణలో భాగంగా స్వయాన బావ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరినా.. రామచంద్రారెడ్డి దంపతులు మాత్రం వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు.
అయితే వైసీపీలో సరైన గుర్తింపు లేకపోవడంతో కొన్నాళ్లుగా తటస్థంగా ఉంటున్నారు. అక్టోబరు 27న పత్తికొండ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన టీడీపీ నాయకులు కొందరు రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఏపీఎస్ఐడీసీ చైర్మన్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి తదితరులు రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు.
ఇందులో భాగంగానే రామచంద్రారెడ్డి.. పత్తికొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో కలిసి సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతులు భారీ బహిరంగ సభ నిర్వహించి జనసందోహం మధ్య టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో కర్నూలు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఎస్వీ, కేఈ కుటుంబాలు రాజకీయంగా ఒకరికొకరు సహకారం అందించుకునే వ్యూహంలో భాగంగానే రామచంద్రారెడ్డి దంపతులు టీడీపీలో చేరబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.