కరోనా వ్యాప్తి కట్టడిలో టీటీడీ మరో ముందడుగు: 5 ఆయుర్వేద మందులు సిద్ధం
తిరుపతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఇప్పటికే అనేక ముందస్తు చర్యలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆయుర్వేద మందుల తయారీతో మరో అడుగు ముందుకు వేసింది. జేఈఓ శ్రీ బసంత్ కుమార్ ఆదేశం మేరకు ఎస్ వీ ఆయుర్వేద కళాశాల, ఎస్ వీ ఆయుర్వేద ఆసుపత్రి, ఆయుర్వేద ఫార్మశీ సంయుక్త ఆధ్వర్యంలో 5 రకాల మందులను తయారు చేశారు.
కరోనా బారినపడకుండా..
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మంగళవారం సాయంత్రం జేఈఓ శ్రీ బసంత్ కుమార్ తన చాంబర్ లో ఈ మందులను విడుదల చేశారు. ఈ మందులు వాడాల్సిన విధానం, వీటివల్ల కరోనా వ్యాధి బారిన పడకుండా ఎలా కాపాడుకోవచ్చు అనే వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఉచితంగా పంపిణీ..
కరోనా నేపథ్యంలో పేద ప్రజలకు అన్నప్రసాదం తయారీ కోసం పని చేస్తున్న వంటశాల ( క్యాంటీన్) ల సిబ్బందికి మొదటగా వీటిని అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ తరువాత విడతల వారీగా టీటీడీలోని అన్ని విభాగాల సిబ్బందికి ఈ మందులను ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆ ఐదు మందులు ఇవే..
జేఈఓ బసంత్ కుమార్ ఆదేశం మేరకు ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర రావు, ఫార్మశీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నారపు రెడ్డి వారి సిబ్బంది బుధవారం ఉదయం తిరుపతి శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలోని 200 మంది వంటశాల సిబ్బందికి ‘ రక్షోజ్ఞ ధూపం" (క్రిమి సంహారక ధూపం ), "పవిత్ర' (చేతులు శుభ్రపరచుకునే ద్రావకం), "గండూషము" (పుక్కిలించే మందు), "నింబనస్యము' (ముక్కులో వేసుకునే చుక్కల మందు), "అమృత' (వ్యాధి నిరోధక శక్తి పెంచే మాత్రలు ) పంపిణీ చేశారు.
ఉద్యోగులందరికీ..
తొలివిడతగా క్యాంటీన్లలో పని చేస్తున్న సుమారు 1000 మంది సిబ్బందికి మాత్రమే పంపిణీ చేయడానికి ఈ మందులు తయారు చేస్తున్నామని ఆయుర్వేద ఫార్మసి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నారపురెడ్డి తెలిపారు. ఆ తరువాత విడతల వారీగా టీటీడీ ఉద్యోగులందరికీ ఈ మందులు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గురువారం ఉదయం తిరుచానూరులో, శుక్రవారం ఉదయం పద్మావతి కళాశాలలోని క్యాంటీన్ సిబ్బందికి మందులు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.
Recommended Video