వైసీపీ పాలనకు వన్ టైమ్ సెటిల్మెంట్; వన్ టైమ్ సీఎంగా జగన్ మిగిలిపోబోతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ టైమ్ సెటిల్మెంట్ పై రగడ కొనసాగుతూనే ఉంది. వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తో ఒకే మొత్తంలో రుణ బకాయిలను చెల్లించి జగనన్న సంపూర్ణ గృహ పథకం ద్వారా, లబ్ధిదారులు ఇళ్ల పై పూర్తి హక్కులు పొందాలని జగన్ సర్కార్ సూచిస్తుంటే, ఓ టి ఎస్ పేరుతో దోపిడీకి తెర తీశారని, పేద ప్రజలను మోసం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలు జగన్ సర్కార్ తీసుకున్న ఓటీఎస్ నిర్ణయంపై తీవ్ర గందరగోళంలో ఉన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇంటి రుణాలను, ఇప్పుడెందుకు చెల్లించాలంటూ ప్రశ్నిస్తున్న వారు కొందరైతే, ఇప్పుడైతే ఇది ఆఫర్, ఆ తర్వాత మొత్తం చెల్లించాల్సిందే అంటూ చర్చిస్తున్న వారు కూడా లేకపోలేదు.

వన్ టైమ్ సెటిల్మెంట్ అంటూ వన్ టైం సీఎంగా జగన్ మిగిలిపోతున్నారు
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎవరూ ఓటిఎస్ చెల్లించవద్దని, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని ప్రకటనలు చేస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లకు, ఇప్పటి ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు చెల్లించాలో చెప్పాలంటూ నిలదీస్తున్నారు.
ఇదే సమయంలో జగన్ సర్కార్ ఓటిఎస్ పై బీజేపీనేత లంకా దినకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్ ఛాన్స్ అంటూ వచ్చి, కలెక్షన్స్ కోసం పేదలను వన్ టైం సెటిల్మెంట్ అంటూ వన్ టైం సీఎంగా జగన్ మిగిలిపోబోతున్నారని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో పేదల ఇళ్ల పైన రుణాలు రద్దు చేస్తామని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని రద్దు చేశారని లంకా దినకర్ ఎద్దేవా చేశారు.

ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లు ఎందుకు చేస్తున్నారో? చెప్పాలి
అంతేకాదు పేదల గృహాలపైన ఓటిఎస్ వారి ఇష్టపూర్వకమే అని చెప్పేవారు ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లు ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటూ లంకా దినకర్ ప్రశ్నించారు. పథకాల రద్దు బెదిరింపుల మాటేమిటి అంటూ నిలదీశారు. ఎప్పుడో పుట్టిన పిల్లవాడికి అతని పెళ్లి సమయంలో బారసాల చేసినట్టు జగన్ సర్కారు పాలన తీరు ఉందని ఓటిఎస్ విషయంలో లంకా దినకర్ వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఆస్తి హక్కు పత్రాల పైన హక్కుదారులు ఫోటోలు ఉండాలి కానీ జగన్ కూడా ఉంచటం ఏమిటీ అంటూ లంకా దినకర్ ప్రశ్నించారు.

ఆస్థి హక్కు పత్రాలపై జగన్ ఫోటోలా?
ఆస్తి హక్కు పత్రాలపై జగన్ ఫోటోలు ఉండడాన్ని దినకర్ గర్హించారు. రాష్ట్రంలో అందరి ఆస్తులకు ఆయనే హక్కుదారు కావాలనుకుంటున్నారా అంటూ లంకా దినకర్ జగన్ పై సెటైర్లు వేశారు. జగన్ కోరినట్టే రాష్ట్ర ప్రజలు జగన్ పాలనకి వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వబోతున్నారని, జగన్ వన్ టైం సీఎంగా మిగిలిపోబోతున్నారని లంకా దినకర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ నిరుపేదల నుండి డబ్బులు వసూలు చేస్తున్న జగన్ సర్కార్ పై బిజెపి నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పేదల ఇళ్ళపై ఓటీఎస్ పిడుగు వేసిన జగన్
జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి కన్నా బిజినెస్ ఎక్కువయ్యింది అని గతంలోనే పేర్కొన్న ఆయన సంక్షేమం కూడా ప్రణాళికాబద్ధంగా లేదని లంకా దినకర్ ఆరోపించారు. పేద, మధ్య తరగతి వర్గాల పాత గృహ లబ్ధిదారుల నుంచి కొత్త విధానాలతో డబ్బులు దండుకోవడంలో జగన్మోహన్ రెడ్డి స్పెషలిస్ట్ అని ఆయన పేర్కొన్నారు. కట్టిన ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా, కొత్త ఇల్లు సరిగ్గా కట్టకుండా వైసిపి ప్రభుత్వం పేదల నుంచి వసూలు మొదలు పెట్టిందని లంకా దినకర్ మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఎప్పుడో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్లపైన ఓటీఎస్ పిడుగు నెత్తిన వేయడం జగన్ మార్క్ పాలనకు నిదర్శనమని లంకా దినకర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications