వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది ... నేడు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది.ఈ సందర్భంగా ఆయన తమది రైతు పక్షపాత ప్రభుత్వమని తెలియజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడారు. రైతులు బాగుంటేనే ఇటు రాష్ట్రంలో అటు దేశం బాగుంటాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రాజ్యం రామరాజ్యం అని నమ్మిన ప్రభుత్వం తమదని వైసిపి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Recommended Video
ప్రభుత్వ ట్రైలరే భయంకరం..నవరత్నాల బదులు నవరత్న తైలంతో : వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు, లోకేష్
ఏకకాలంలో 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏకకాలంలో 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు . రైతులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు . ఇక ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి అని చెప్పిన సీఎం జగన్ రైతు భరోసా కేంద్రాలతో గ్రామాలలో విప్లవాత్మక మార్పు రాబోతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతు భరోసా ద్వారా 10200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన అన్నారు.
పాదయాత్రలో రైతుల కష్టాలు చూశానన్న జగన్
రైతులకు అన్ని సమయాల్లో అండగా ఉంటామని పేర్కొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులు పంట పండించడానికి విత్తనాలు వేసి దగ్గరనుండి, వంట విక్రయించే వరకు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఇప్పటికే విత్తన సరఫరా కార్యక్రమం నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం,పంటపొలాలలో ప్రభుత్వ ఖర్చులతో బోర్లు కూడా వేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగా చాలా ఉద్వేగంగా మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానని,వారి బాధలు విన్నానని రైతులు ఇబ్బందులను చూశానని అందుకే ప్రజల కష్టాలు తీర్చడం కోసం అన్ని వర్గాల వారికి ఉపయుక్తం గా ఉండేలా మేనిఫెస్టోను తీసుకువచ్చామని పేర్కొన్నారు.
రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు
ఇక ఏపీలో వ్యవసాయానికి అధునాతన సాంకేతికత జోడించి వ్యవసాయం లాభాల బాట పట్టించాలని నిర్ణయించారు .వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు . కాల్ సెంటర్ ద్వారా రైతులకు సలహాలు, సూచనలు , రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు మారనున్నాయని పేర్కొన్నారు .
రైతు బాగుంటేనే దేశం బాగుండేది
ఒక్క రైతుల కష్టాలే కాకుండా మహిళల, వృద్ధుల, చిన్నారుల, విద్యార్థుల ఇబ్బందులను కూడా తెలుసుకున్నాను కాబట్టి వారికి కావలసిన సంక్షేమ పథకాలను తీసుకువచ్చి 90 శాతం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుండేది అని నమ్మిన ప్రభుత్వం తమదని చెప్పారు . రైతు సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే పార్టీ ఏదైనా ఉంటే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేనని ఆయన గట్టిగా చెప్పారు.