Oneindia Telugu Exclusive: కేబినెట్ లిస్టు ఖరారు..!! శాఖలపైనా సీఎం కసరత్తు - జాబితాలో ఉన్నదెవరు..!!
సీఎం జగన్ 2024 టీం ను సిద్దం చేసుకుంటున్నారు. కేబినెట్ కూర్పు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. పాత మంత్రుల్లో 10 మందితో సహా.. కొత్తగా 15 మందికి ఛాన్స్ దక్కనుంది. ఇప్పటి వరకు జగన్ తన ఎంపిక లో సామాజిక - ప్రాంతీయ సమీకరణాలనే లెక్కలోకి తీసుకుంటూ వచ్చారు. ఈ సారి కేబినెట్ కూర్పులో సీనియార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అటు పార్టీ పరంగా సేవలు అందిస్తూ..ఇటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించగలరని భావించిన వారిని కేబినెట్ లోకి తిరిగి అవకాశం ఇస్తున్నారు. అదే సమయంలో వారిలోనూ సామాజిక - ప్రాంతీయ లెక్కల ఆధారంగానే ఎంపిక జరుగుతోంది. ప్రస్తుతం మొత్తం 24 మంది మంత్రు లు ఉండగా.. వారిలో 10 మందికి రీఎంట్రీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

సీనియార్టీ - సమర్ధత ఆధారంగా
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు - ప్రసాద రాజు పేర్ల మీద తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే, పాత మంత్రుల్లో పేర్ని నాని సైతం ఖాయమంటూ ప్రచారం సాగినా.. క్రిష్ణా జిల్లా సమీకరణాల్లో భాగంగా పేర్నికి ఛాన్స్ దక్కటం లేదని సమాచారం. కొడాలి కి బెర్తు ఖరారు అయింది. పేర్ని నాని పేరు చివరి నిమిషం లో జాబితాలో ఉంటుందా లేదా అనేది డౌట్ గా మారింది. శ్రీకాకుళం నుంచి ప్రస్తుత మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాద రావు పేరు ఖాయమైందని సమాచారం. మరో మంత్రి అప్పలరాజు కొనసాగనున్నారు. విజయ నగరం నుంచి బొత్సాను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో మంత్రిగా ఎస్టీ వర్గానికి చెందిన రాజన్న దొర..లేదంటే ఎస్టీ మహిళ కు అవకాశం పరిశీలనలో ఉంది. విశాఖ జిల్లాలో అమర్ నాద్.. ముత్యాల నాయుడు పేర్లు ఖరారు అయినట్లు సమాచారం.

బీసీ -ఎస్సీ - ఎస్టీ వర్గాలకు మరింత ప్రాధాన్యత
తూర్పు గోదావరి నుంచి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ కొనసాగింపు ఖాయమైంది. అదే జిల్లా నుంచి దాడిశెట్టి రాజా.. దొరబాబు పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి నుంచి ప్రస్తుత మంత్రి తానేటి వనిత కొనసాగింపు ఖాయమైనట్లు తెలిసింది. ఇదే జిల్లా నుంచి గ్రంధి శ్రీనివాస్ కు ఖాయమైనట్లు సమాచారం. క్షత్రియ వర్గానికి కేటాయింపు పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. క్రిష్ణా జిల్లా నుంచి కొడాలి నానికి ఖరారు కాగా..పేర్ని నాని ది పెండింగ్ లో ఉంది. గుంటూరు జిల్లా నుంచి బీసీ మహిళ - ఓసీ వర్గానికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం నుంచి బాలినేని కి అవకాశం లేదు. అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కేబినెట్ లో కొనసాగనున్నారు. నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు అయిందని విశ్వసనీయ సమాచారం. కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యవసాయ శాఖ కేటాయించాలని నిర్ణయించారు.

సీనియర్లలో వారికే ఛాన్స్.. సీఎం జగన్ ఆచి తూచి
చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి కొనసాగింపు ఖాయం కాగా, బలిజ వర్గానికి మరో బెర్తు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నుంచి జయరాం కొనసాగింపు ఖాయమైంది. మరో సీటు శిల్పా చక్రపాణిరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అనంతపురం నుంచి బీసీ వర్గానికి చెందిన ఇద్దరికి కేబినెట్ పదవులు ఇవ్వటానికి రంగం సిద్దమైందని తెలుస్తోంది. కడప నుంచి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తిరిగి కేబినెట్ లో కొనసాగనున్నారు. అదిమూలపు సురేష్.. అంజాద్ బాషా..అప్పలరాజు శాఖలు యధావిధిగా కంటిన్యూ అవుతాయని తెలుస్తోంది. కొడాలి నానికి ఇరిగేషన్ అప్పగించనున్నట్లు తెలుస్తోంది. జయరాం కు పౌరసరఫరాల శాఖ దక్కే ఛాన్స్ ఉంది. అయితే, ఈ సారి హోం మంత్రి పవ్చిమ గోదావరి నుంచి ఎస్సీ మహిళకు అప్పగించే అంశం తుది పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే, వనితకు హోం శాఖ ఇస్తారా..లేదా అనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. బీసీ - ఎస్సీ- ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications