ONGC లీక్ : 18 గంటలుగా ఆగని అగ్ని కీలలు.. నేడు ఢిల్లీ నుంచి స్పెషల్ టీం !!
ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరుసుమండ వద్ద ఉన్న ఓఎన్జీసీ (ONGC) పైపులైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఏర్పడిన బ్లో అవుట్ రెండో రోజు కూడా ఆగకుండా కొనసాగుతోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
18 గంటలుగా అదుపులోకి రాని మంటలు..
దాదాపు 18 గంటలుగా ఈ గ్యాస్ లీక్ నిరంతరంగా కొనసాగుతోంది. గ్యాస్తో పాటు క్రూడ్ ఆయిల్ కూడా లీక్ అవుతుండటంతో మంటల తీవ్రత మరింత పెరిగినట్టు చెబుతున్నారు. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయన్న స్థాయిలో ఎగిసి పడుతుండటంతో ఘటన స్థలం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం..
కాగా ఈ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల ప్రత్యేక బృందం రానున్నట్లు అధికారులు తెలిపారు. ఆధునిక పద్ధతుల్లో మంటలను అదుపు చేసేందుకు 'వాటర్ అంబరిల్లా' టెక్నిక్ను ఉపయోగించనున్నారు. నాలుగు వైపుల నుంచి భారీగా నీటిని విరజిమ్ముతూ మంటలను తగ్గించేందుకు ప్రయత్నం జరుగుతుంది.
ఈ మేరకు గ్యాస్ లీక్ నియంత్రణకు అవసరమైన పైపులు, ఇతర కీలక సామాగ్రిని నరసాపురం, రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నారు. ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి కొన్ని గంటలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
నాలుగు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత..
మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఘటన స్థలానికి సమీపంలోని నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటువంటి అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా గ్రామాల్లోకి పొగ, మంచు మాదిరి గ్యాస్ చొచ్చుకొస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఉత్పత్తిలో ఉన్న బావి అకస్మాత్తుగా ఆగిపోవడంతో వర్క్ ఓవర్ రిగ్ ద్వారా పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్తో కూడిన గ్యాస్ ఎగజిమ్మినట్లు తెలుస్తోంది. దీని వల్ల బ్లో అవుట్ పరిస్థితి ఏర్పడిందని అధికారులు అనుమానిస్తున్నారు.
కోనసీమ ప్రాంతంలో గ్యాస్ లీక్లు, బ్లో అవుట్లు తరచుగా జరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. చమురు, సహజ వాయు వెలికితీత పేరుతో కోనసీమను "నిప్పుల కొలిమి"గా మారుస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ భద్రతా ప్రమాణాలను సరిగా అమలు చేయడంలో విఫలమవుతోందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిపుణుల బృందం రాగానే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని తెలిపారు. స్థానిక అధికారులు, ఓఎన్జీసీ సిబ్బంది ఘటన స్థలంలోనే ఉండి పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications