ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి YCPలో లేరా?
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి YCPలో లేరా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఒంగోలులో ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత కీలక సమస్యపై సమావేశం ఏర్పాటు చేస్తే నగరపాలక సంస్థ అధికారులుకానీ, సిబ్బందికానీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎంపీ కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు చేస్తే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఒకరిని పంపించి చేతులు దులుపుకున్నారు. ఇదీ.. ప్రజా సమస్యల పరిష్కారంపై ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులకు ఉన్న చిత్తశుద్ధి??.. ఒక ఎంపీకిచ్చే గౌరవం.!!

రైల్వే గేట్లవద్ద ట్రాఫిక్ ను పరిష్కరించేందుకే..
ఒంగోలు లోని అగ్రహారం, పాకల, టంగుటూరు, సూరారెడ్డిపాలెం రైల్వేగేట్ల వద్ద ట్రాఫిక్ ప్రతిరోజు సమస్యగా మారింది. ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు ఎంపీ రైల్వే, ఆర్ అండ్ బీ, మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్లకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు. కానీ ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు.

బాలినేని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో తామంతా పాల్గొన్నామని చెబుతూ అధికారులు సహాయ కమిషనర్ గా పదవీ విరమణచేసి ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చెత్తను సేకరించే ఉద్యోగులపై ఇన్ ఛార్జిగా ఉన్న డి.బ్రహ్మయ్య అనే ఉద్యోగిని పంపించారు. దీనిపై ఎంపీ మాగుంట తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మూడురోజుల క్రితమే సమాచారం ఇచ్చినప్పటికీ ఇలా వ్యవహరించారన్నారు. ఆయా ప్రాంతాల్లో వంతెనలులేక ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారని, వాటి నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభిద్దామంటే అధికారుల నుంచి సహకారం కొరవడుతోందని ఎంపీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

రాబోయే ఎన్నికల్లో TDP తరఫున?
రాబోయే ఎన్నికల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రొటోకాల్ ప్రకారం కూడా కొన్ని కార్యక్రమాలకు ఎంపీకి సమాచారం ఇవ్వడంలేదని మాగుంట అనుచరులు ఆరోపిస్తున్నారు. కొన్ని నెలలుగా తనపట్ల ప్రభుత్వంకానీ, పార్టీకానీ అనుసరిస్తున్న తీరుపై ఎంపీ మాగుంట తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల సందర్భంగానే ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. సరైన ప్రాధాన్యం కూడా దక్కడంలేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారంటూ ప్రచారం నడుస్తోంది. అందులో వాస్తవమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.!!












Click it and Unblock the Notifications