వ్యభిచార రొంపిలోకి..: అక్కాచెల్లెళ్ళే అసలు ముద్దాయిలు
ఒంగోలు: అందరి కంటే అయినవాళ్ళే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళన్న చేదునిజం మరోసారి రుజువయ్యింది. కష్టంలో ఉన్న ఆడ కూతురికి కాస్తంత సాయం చేసి అండగా నిలబడాల్సిన బంధువులు రాబందులై ఏళ్ళ తరబడి వ్యభిచారకూపంలో బందీని చేసి, శరీరం శిధిలమైన తరుణంలోనూ ఆమెను వదలకుండా వెట్టిచాకిరీ చేయించుకున్న దగ్గరి బంధువుల పైశాచిక కృత్యం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
స్థానిక హౌసింగ్బోర్డు కాలనీలోని ఓ ఇంటి గోడదూకి అర్థనగ్నంగా రోడ్డుమీద పరుగులు తీసిన అభాగ్యయువతి జీవితంతో అడుగడుగునా వంచనలే! ఆ బాధితురాలు స్థానికులకు, పోలీసులకు అందించిన వివరాల ప్రకారం- కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆమె మోటుమాల గ్రామానికి చెందిన యువకుని పెళ్ళి చేపుకుంది. వీరి కాపురం కొన్నాళ్ళు బాగానే సాగింది. వారికి ఇద్దరు సంతానం కలిగారు. కొద్దికాలం తర్వాత భార్యాభర్తల మధ్య తగవులు మొదలయ్యాయి. ఫలితంగా భార్యాభర్తలు విడిపోయారు.
ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఇది జరిగిన కొంతకాలానికి వరసకు అక్కా చెల్లెళ్ళయిన బత్తుల వెంకటలక్ష్మి, బత్తుల రమణలు 'ఒంగోలులో తెలిసిన వాళ్ళఇంట్లో పెళ్ళి ఉంది... సరదాగా వెళ్ళి చూసొద్దాం...' అంటూ చెప్పారు. వెళ్ళనా వద్ధా అంటూ సంశయిస్తున్న సమయంలో పెళ్ళవ్వగానే తిరిగి వచ్చేద్దామంటూ నమ్మబలికారు. సరేనంటూ ఆమె వారివెంట వెళ్ళింది. ఒంగోలు చేరగానే గోపాలనగరంలో ఉన్న బత్తుల వెంకటలక్ష్మి ఇంటికి తీసుకువెళ్ళారు. భోజనం చేసి పడుకున్నాక ఆమెకు ఇంకేమీ తెలియలేదు. తినే ఆహారంలోనో లేక తాగే పానీయాల్లోనో ఏ మత్తుమందో కలిపి ఉండవచ్చునంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఆమె మత్తునుంచి తేరుకున్నప్పుడల్లా మళ్ళీ మత్తు ఇచ్చేవారని బాధితురాలు చెప్పింది.
కొద్దిరోజుల తర్వాత తనకు ప్రతిఘటించే అవకాశం ఇవ్వకుండా అలా మత్తులో ఉంచుతూనే తనతో వ్యభిచారం చేయించారని ఆమె కన్నీళ్ళతో చెప్పుకుంది. ఒంగోలులోని అనేక ప్రాంతాలకు తనను బలవంతంగా తిప్పారనీ, ఆ తర్వాత తనను ముంబయిలోని రెడ్లైట్ ఏరియాకు పంపించేశారని వివరించింది. ఈ వృత్తికి తాను శారీరకంగా అలవాటు పడిపోవడంతో తాను మనసు చంపుకుని ఇదే తన బతుకుతెరువుగా మార్చుకున్నానని ఆమె చెప్పింది. ఇదిలాఉండగా కొత్తపట్నంలో తన తల్లి తాను కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వెంకటలక్ష్మి, రమణలు తన తల్లికి తనగురించి అబద్దాలు చెప్పి, తాను వ్యభిచార వృత్తిలోకి తనంతట తానుగానే వెళ్ళిపోయినట్లుగా చిత్రీకరించారనీ బాధితురాలు చెప్పింది.

కొంత కాలం గడిచేసరికి తన శరీరం ఆవృత్తికి సహకరించకపోవటంతో వెంకటలక్ష్మి, రమణలు తనను ఒంగోలులోని హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న తమ ఇంట్లోనే బందీగా ఉంచి తన చేత బలవంతంగా ఇంటిపనులు చేయించుకుంటున్నారనీ, ఈ బాధలు పడలేక ఒకసారి తాను ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాననీ ఆమె చెప్పింది. శుక్రవారం ఉదయం బాత్రూం కోసం వెలుపలికి వచ్చినప్పుడు ఎవరూ గమనించకుండా గోడదూకి బయటకి పారిపోయి వచ్చానంటూ వివరించింది. అర్థనగ్నంగా నడిరోడ్డు మీద పరుగులు తీస్తున్న ఈమెను గమనించిన స్థానికులు ఆమె ఒంటిని కప్పుకోడానికి చీర యిచ్చి ఆమెకు ధైర్యం చెబుతూ ఏం జరిగిందని అడిగితే తాను పడ్డ బాధలన్నీ కన్నీళ్ళమధ్య చెప్పుకుంది.
ఆతరువాత స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి, హౌసింగ్బోర్డు కాలనీలో ఉంటున్న వెంకటలక్ష్మి, రమణలను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయమై మహిళాసంఘాల నేతలు హెల్ప్లైన్కు సమాచారం అందించడంతో వైద్యపరీక్షల అనంతరం ఆమెను రెస్క్యూ హోమ్కు తరలించారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో బాధితురాలు తనను ఎక్కెడెక్కడకు తీసుకువెళ్ళిందీ వివరించినట్లు తెలిసింది.
ఒంగోలులోని గోపాలనగరం, కమ్మపాలెం, భాగ్యనగర్, సత్యనారాయణపురం, నిర్మల్నగర్, అరుణోదయకాలనీ, బలరాంకాలనీలలో ఉన్న వ్యభిచార గృహాల వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. అక్కడి నిర్వాహకుల వివరాలతోబాటు ఆ గృహాల నిర్వహణలో వెంకటలక్ష్మి, రమణల పాత్ర ఉందనీ, ఈ ప్రాంతాలన్నింటికీ వారు తనను తీసుకువెళ్ళారని బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. తాలూకా పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications