మళ్లీ మొదలైన ఉల్లి లొల్లి: రైతుల కంట కన్నీరు, ఇదే మాయాజాలం
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదని నానుడి...మన ఆహారపు అలవాట్ల రీత్యా అంతటి విలువైన ఉల్లి ఇప్పుడు దాని ధర కారణంగా అందుబాటులో లేకుండా పోతోంది. కిలో ఉల్లి ఖరీదు ఆఫ్ సెంచరీ దాటి సెంచరీ దిశలో దూసుకెళ్తోంది... అయితే ఈ ఉల్లి స్కోరు వ్యాపారులకు కాసుల పంట కురిపిస్తుండగా వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. తనను సాగు చేసిన రైతులకు కన్నీరు మిగిల్చిన ఉల్లి విక్రయదారులకు మాత్రం కల్పవృక్షంలా మారింది. అంతకంతకూ పెరిగిపోతున్న ఉల్లి ధర పై స్పెషల్ స్టోరీ...
ఉల్లి సాగుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఉల్లిని అత్యధికంగా పండించే జిల్లా కర్నూలు ఎపిలో ఉండటమే ఆ స్పెషాలిటీ. అయితే ఉల్లిని పెద్ద ఎత్తున సాగు చేసే ఈ జిల్లా రైతులే ఇప్పుడు ఉల్లి మాయాజాలంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉల్లి మాయాజాలం...
నిజానికి ఉల్లి ధరలు ఇలా కొండెక్కడానికి దళారులు, వ్యాపారుల మాయాజాలమే కారణం. ఉల్లిపాయలు మార్కెట్లోకి వచ్చే సమయాన్ని అంచనా వేయడం, ఆ సమయాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గించటం, ఆ తగ్గింపు ధరలకు రైతుల నుంచి ఉల్లిపాయలను వ్యాపారులు కొనుగోలు చేయడం చేస్తున్నారు. తక్కువ ధరతో కొనుగోళ్లు కొనసాగిస్తూ ఇక రైతుల వద్ద ఉల్లిపాయ నిల్వలు ఖాళీ అయ్యాయని తెలియగానే అమాంతం ధరలు పెంచేసి అక్కడనుంచి వ్యాపారులు భారీగా లాభాలను దండుకుంటున్నారు. రైతుల నుండి క్వింటా రూ.300 నుంచి రూ.800ల వరకు ధరతో కొనుగోలు చేసిన వ్యాపారులు ఆ తరువాత బహిరంగ మార్కెట్లో అవే ఉల్లిపాయలను ఏకంగా క్వింటా రూ.1500 నుంచి రూ.4,500 వరకూ ధరలను పెంచి అమ్ముతున్నారు.
అంతటా ఉల్లి ఘాటు..
వ్యాపారుల మాయాజాలంతో ఉల్లిని అత్యధికంగా పండించే ఈ ప్రాంతాల్లోనే వినియోగదారులు కిలో రూ.50లు పెట్టి ఉల్లిపాయాలు కొనాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో అయితే ఉల్లి ధర కిలో రూ.70 నుంచి రూ.80 వరకు చేరుకుంది.
దిగుబడి కిందకి...ధర పైపైకి...
ఉల్లి ధర భారీగా పెరగడంతో ప్రభుత్వమే కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లిని కొనుగోలు చేసి రైతుబజార్లకు తరలిస్తోంది. ప్రస్తుతం కర్నూలు వ్యవసాయ మార్కెట్కు ఉల్లి సరుకు ప్రతి రోజూ 3 వేల నుంచి 4 వేల క్వింటాళ్ల మధ్య వస్తోంది. అదే ఉల్లి దిగుబడులు బాగా వచ్చే అక్టోబర్, నవంబరు నెలల్లో రోజూ దాదాపు 10 వేల క్వింటాళ్ల సరుకు మార్కెట్కు వచ్చేది. దీంతో స్థలం చాలటం లేదని వేలం పాడేందుకు మార్కెటింగ్ శాఖాధికారులు మార్కెట్కు వచ్చే సరుకులను నియంత్రించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రైతుల వద్ద ఉత్పత్తులు లేకపోవడంతో వ్యాపారులు అమాంతం ధరలు పెంచి అమ్ముతున్నారు.
అన్నీ ప్రతికూల పరిస్థితులే...
అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో ఉల్లి పంట దెబ్బ తిని దిగుబడులు బాగా తగ్గాయి.మరోవైపు ఉల్లిని అత్యధికంగా పండించే రాష్ట్రం మహారాష్ట్రలోనూ ఉల్లి దిగుబడులు భారీగా తగ్గిపోవడం ఉల్లికి మరింత డిమాండ్ పెంచింది. అయితే ఉల్లి ఉత్పత్తులు అంతో ఇంతో మార్కెట్కు వస్తున్న ఈ సీజన్లోనే ఉల్లి ధర కిలోకు కనీసం రూ.50లకు పైగా ధర పలుకుతుండగా, ఇక దిగుమతులు పూర్తిగా తగ్గుముఖం పట్టే జనవరి తర్వాత ధరలు ఇంకెంత పెరుగుతాయో నని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జనవరి తర్వాత ఉల్లి ధర కిలో రూ.100 దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు.
ఉల్లి రైతుల ఆవేదన...
ఎకరాకు రూ.70 వేలు ఖర్చు పెట్టి ఉల్లిని సాగు చేశామని, గతేడాది క్వింటా రూ.4 వేల నుంచి రూ.5 వేలు దాకా ధర పలకడంతో ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశామని కర్నూలు జిల్లాకు చెందిన కొందరు రైతులు తెలిపారు. అయితే ఈ ఏడాది పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వెళితే మార్కెట్లో క్వింటాకు ధర రూ. 800 రావడంతో నష్టమే మిగిలిందని కనీసం పెట్టుబడి కూడా చేతికి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కొనాలంటే భయమేస్తోంది....
ఇప్పుడు ఉల్లి కొనాలంటేనే భయమేస్తోందని వినియోగదారులు అంటున్నారు. ఎప్పుడు ధర పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. మొన్నటిదాకా రూ.10లకు కూడా దొరికిన ఉల్లిపాయలు ఇప్పుడు కిలో రూ.50లు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చిందని,ముందు ముందు ఇంకెంత పెరుగుతుందోనని భయంగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ఉల్లి ధర పెరగడంతో బైట హోటళ్లలో, కర్రీ పాయింట్లలో కూడా ఉల్లి వాడకం మానేశారని చెబుతున్నారు.