ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయికి రూ.13లక్షల బదిలీ: ఆ యువకుడి పరిస్థితి ఏంటి?
ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పోలీసులు జాగ్రత్త వహించాలని చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
విశాఖపట్నం: ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పోలీసులు జాగ్రత్త వహించాలని చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. తాజాగా, ఆన్లైన్ పరిచయమైన ఓ అమ్మాయి వలలో పడిన ఓ యువకుడు ఏకంగా రూ.13లక్షలను ఆమెకు సమర్పించుకున్నాడు. కాగా, ఆ మొత్తం కూడా అతడి తండ్రికి వచ్చిన పదవీ విరమణ వచ్చింది కావడం గమనార్హం. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

ఆన్లైన్లో పరిచయం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నగరంలోని రైల్వేన్యూకాలనీకి చెందిన సుభాశ్ చంద్రదాస్(60) రైల్వేలో పనిచేసి ఫిబ్రవరి నెలలో పదవీ విరమణ చేశారు. ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కింద సుమారు రూ.40 లక్షల నగదు వచ్చింది. అందులో కొంత మొత్తాన్ని అవసరాలకు వాడుకుని మిగతా దాన్ని దొండపర్తి ఎస్బీఐ ఖాతాలో వేశారు. చంద్రదాస్కు 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ యువకుడు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కోల్కతా ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఛాటింగ్ ప్రారంభించాడు.
Recommended Video


డబ్బులు కాజేసిందిలా..
ఆమె తన ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఆ యువతి మాటల మధ్యలో తనకు రూ.40 వేలు కావాలని, తర్వాత తిరిగి ఇచ్చేస్తానని అడిగింది. వెంటనే ఆ యువకుడు తన తండ్రి ఇంట్లో లేని సమయంలో ఆయన ఏటీఎం కార్డు చేజిక్కించుకుని జులై 20న బ్యాంకుకు వెళ్లి ఆ యువతి ఇచ్చిన కోల్కతా ఎస్బీఐ బ్యాంకు ఖాతాకు ఆన్లైన్లో తొలుత రూ.40 వేలు వేశాడు.

రెండ్రోజుల్లోనే రూ.13లక్షలు..
మళ్లీ మరుసటి రోజు ఫోన్ చేసి మరో రూ.40 వేలు కావాలని అడిగింది. యువకుడు 21వ తేదీ ఉదయం 10.30 సమయంలో అదే శాఖ నుంచి తిరిగి నగదు పంపించాడు. అది చాలదని మరింత కావాలని ఆమె అడిగే కొద్దీ యువకుడు డబ్బు పంపిస్తూనే ఉన్నాడు. అలా ఈ రెండు రోజుల్లో 34 సార్లు రూ.13,29,800 ఆమె ఖాతాలో వేశాడు. ఆ సమయంలో తండ్రి చంద్రదాస్కు బ్యాంకు నుంచి ఓటీపీ కానీ, సంక్షిప్త సందేశాలు కానీ రాకపోవడంతో ఆయనకు ఎలాంటి అనుమానం తలెత్తలేదు.

ఇలా దొరికిపోయాడు..
కాగా, జులై 21వ తేదీ రాత్రి మాత్రం నగదు ఉపసంహరణకు సంబంధించిన సందేశం ఆయన ఫోన్కు వచ్చింది. దీంతో కంగారుపడి తన ఖాతాలో నగదు పోయిందంటూ హుటాహుటిన నాలుగో పట్టణ పోలీసుల్ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకు వారిని సంప్రదించగా ఏటీఎం కార్డు వినియోగించి నగదు జమ యంత్రం (సీడీఎమ్) ద్వారా సొమ్ము బదలాయించి నట్లు తెలిపారు. దీంతో కుటంబసభ్యుల్ని పోలీసులు విచారించగా తానే చేశానని ఆ యువకుడు ఒప్పుకున్నాడు.

దర్యాప్తు షురూ..
నగదు వేసిన కోల్కతా శాఖ ఖాతాలోంచి ఆ సొమ్ము వేరే శాఖలకు జమ అయినట్లు బ్యాంకు అధికారుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. కాల్డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇదంతా యువతి వేసిన ఎత్తా? లేదా ఆమె వెనుక సైబర్ నేరగాళ్ల ముఠా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. దీనిపై పోలీస్ బృందాలు కోల్కతాకు బయలుదేరాయి. కాగా, పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ.. ఏ మాత్రం ఆలోచించకుండా ఇలా సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసాలకు గురవుతుండటం శోచనీయం.












Click it and Unblock the Notifications