సింగపూర్కు రైతులు: స్పందన అంతంతే, కారణాలు ఇవే!
అమరావతి రైతులను సింగపూర్కు పంపించేందుకు సీఆర్డీఏ ఇటీవల సిద్ధమైంది. అయితే దీనికి ఊహించినంతగా రైతుల నుంచి మద్దతు రాలేదని తెలుస్తోంది.
అమరావతి: అమరావతి రైతులను సింగపూర్కు పంపించేందుకు సీఆర్డీఏ ఇటీవల సిద్ధమైంది. అయితే దీనికి ఊహించినంతగా రైతుల నుంచి మద్దతు రాలేదని తెలుస్తోంది.
వంద మంది రైతులను మూడు విడతలుగా పంపిద్దామని నిర్ణయించుకున్నవిషయం తెలిసిందే. అయితే కేవలం 150 మంది రైతులు మాత్రమే ఉత్సుకత చూపించినట్లుగా తెలుస్తోంది. అందుకు విమాన ఛార్జీలు కూడా వారే భరించాలని సిఆర్డీఏ చెప్పడమే కారణమని తెలుస్తోంది.

సీఆర్డీఏ చాలామంది అనుకుంటే
సింగపూర్ వెళ్లాలనుకునే రైతులు రాజధాని గ్రామాల్లోని లోకల్ కాంపిటెంట్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఆర్డీఏ గత నెలలో ప్రకటించింది. కనీసం మూడు వందలకు పైగా రైతులు ఉత్సాహం చూపిస్తారని భావించారు. కానీ గడువు తేదీ పూర్తయ్యే ఈ నెల 5వ తేదీ నాటికి కేవలం 150 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

అందులో 123 మంది అర్హులు
దరఖాస్తు చేసుకున్న రైతుల్లో 123 మంది అర్హులుగా తేలారని తెలుస్తోంది. అందులో వంద మందిని లాటరీ ద్వారా త్వరలో ఎంపిక చేసి, బృందాలుగా సింగపూర్ పంపించనున్నారు. తక్కువ మంది రైతులు సింగపూర్ పర్యటనకు ముందుకు రావడానికి విమాన ఛార్జీలు, ఇతర ప్రయాణ ఖర్చులను వారే భరించాలని నిబంధన విధించడమే కారణమని తెలుస్తోంది.

అందుకే తగ్గిన రైతులు
కేవలం సింగపూర్లో బస, అక్కడ స్థానికంగా తిరిగేందుకు అయ్యే ఖర్చులను మాత్రమే సీఆర్డీయే భరిస్తుందని చెప్పడంతో ఆర్థికంగా అంత స్థోమత లేని రైతులు పలువురు విమాన టిక్కెట్లు కొనుగోలు చేయలేమని చెప్పి, దరఖాస్తు చేసుకోలేదు.

మరో కారణమూ
ఆర్థికంగా ఉన్న కొందరు రైతులు కూడా వెనక్కి తగ్గడానికి మరో కారణం ఉందని తెలుస్తోంది. సీఆర్డీఏ దరఖాస్తుల వడపోత పూర్తి చేసి అర్హులెవరో ప్రకటించేసరికి సింగపూర్ పర్యటనకు వెళ్లేందుకు అట్టే సమయం ఉండదని, దాని ఫలితంగా కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల ప్రయాణ ఖర్చులు అవుతాయని భావిస్తున్నారు. ముందే ప్రకటిస్తే కనుక విమాన ఛార్జీలు చాలా తక్కువగా అయ్యేవని అంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంకొందరు రైతులు వెనక్కి తగ్గారని తెలుస్తోంది.

సింగపూర్ పర్యటన ఎందుకంటే
రాజధానిని సింగపూర్ మాదిరిగా అభివృద్ధి పరుస్తామంటున్న సీఆర్డీయే ఆ దేశం ఏ విధంగా ఉంటుందో, అక్కడి మౌలిక వసతులు ఏ స్థాయిలో ఉంటాయో అమరావతి రైతులకు ప్రత్యక్షంగా చూపేందుకు రైతులను సింగపూర్ పర్యటనకు తీసుకెళ్లాలని సీఆర్డీఏ భావించింది.












Click it and Unblock the Notifications