ఏపీలో ఆపరేషన్ పరివర్తన్-2.0; నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ ఉక్కుపాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన్ లో మొన్నటి వరకు గంజాయి సాగుపై ఉక్కు పాదం మోపిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నాటుసారా స్థావరాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా గత 16 రోజులుగా భారీ ఎత్తున నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహిస్తోంది.

ఆపరేషన్ పరివర్తన్ 2.0లో భాగంగా నాటుసారా స్థావరాలపై దాడులు
ఆపరేషన్ పరివర్తన్ 2.0లో భాగంగా నాటుసారా స్థావరాలపై దాడులను కొనసాగిస్తున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3403 నాటుసారా కేసులను నమోదు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం నాటుసారా వ్యాపారం నిర్వహిస్తున్న 2,066 మందిని అరెస్టు చేసినట్లుగా వెల్లడించింది.
ఇప్పటి వరకు 44 వేల లీటర్ల నాటుసారా ధ్వంసం చేయగా, 155 వాహనాలను సీజ్ చేసినట్టుగా ఎస్ఈబీ పేర్కొంది. నాటుసారా స్థావరాలపై జరుగుతున్న దాడుల్లో భాగంగా 16 లక్షల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.

15 మందిపై పీడీ యాక్ట్ పెట్టిన అధికారులు
నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు చేసిన అధికారులు ఈ కేసులలో మొత్తంగా 15 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లుగా సమాచారం. పశ్చిమగోదావరి జిల్లాలో ఐదుగురిపై పి.డి యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు గా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్లం సరఫరాదారుల నుంచి, నాటు సారా తయారు చేస్తున్న వారి వరకు ఎవరిని వదలకుండా ఏపీ సర్కార్ బైండోవర్ కేసులు నమోదు చేస్తోంది.

ఏపీలో మద్యం విధానంలో రేట్లు పెంచటంతో రెచ్చిపోతున్న నాటుసారా మాఫియా
రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేయాలని భావించిన ఏపీ ప్రభుత్వం మద్యం షాపులు తగ్గించి, ధరలను పెంచి మద్యం వినియోగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించింది. అయితే రాష్ట్రంలో ధరలు పెంచడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణా కొనసాగుతోంది. ఇక రాష్ట్రంలోనూ అడవులు, వాగులు, వంకల్లో గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారు చేస్తున్న ముఠాలు కూడా పెరిగిపోయాయి.

జంగారెడ్డి గూడెం మరణాలతో ఏపీలో నాటు సారాపై టీడీపీ యుద్ధం
అయితే జంగారెడ్డి గూడెంలో వరుస మరణాల తర్వాత నాటు సారా తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వంపై నాటు సారా మరణాలపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. టీడీపీ అధికార వైసీపీని టార్గెట్ చేస్తుంది. రాష్ట్రంలో మద్యం విధానంపైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. నాటు సారా మరణాలకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని టీడీపీ మండిపడుతుంది. నాటు సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపిస్తుంది. ఇక ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వం రాష్ట్రంలో నాటు సారాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశించింది.

మొన్నటిదాకా గంజాయిపై.. ఇప్పుడు నాటు సారాపై ఏపీ ప్రభుత్వం కన్నెర్ర
దీంతో అప్రమత్తమైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సారా సరఫరాదారులపై పీడీ యాక్ట్ లను ప్రయోగిస్తూ, నాటుసారా స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే గంజాయి సాగుపై ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా ఉక్కుపాదం మోపిన అధికారులు ఇప్పుడు, రాష్ట్రంలో నాటుసారా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఎక్కడికక్కడ సారా మాఫియా కు చెక్ పెట్టే పనిలో పడ్డారు.












Click it and Unblock the Notifications