గెలుపుపై సీఎం జగన్ ధీమా వెనుక - లెక్క పక్కా: ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రం..!!
జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. గెలుపుపై ధీమా వెనుక కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
వై నాట్ 175. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తాం. సీఎం జగన్ ఇదే నినాదంతో వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా..తాను సింగిల్ గా సింహం లాగానే ఎదుర్కొంటానని స్పష్టం చేసారు. తాను చేసిన మంచి ప్రతీ ఇంటికి అందితే తనకు మద్దతుగా నిలవాలని పిలుపునిస్తున్నారు. సామాజిక న్యాయం- సంక్షేమం తన ఆయుధాలుగా జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. తాజాగా విశాఖ కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ వైసీపీ నాయకత్వానికి మరింత జోష్ పెంచింది. తాజాగా.. ప్రతిపక్ష పార్టీల పైన జగన్ గెలుపుపై జగన్ ధీమా వెనుక స్పష్టమైన లెక్క కనిపిస్తోంది.

సామాజిక న్యాయం అస్త్రంగా..
2019 ఎన్నికలలో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ కలిసి వచ్చింది. ఊహించని విధంగా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణం అమలు చేసారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి రాష్ట్రంలో ప్రధాన ఓట్ బ్యాంక్ గా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల ఓట్ బ్యాంకు పైన గురి పెట్టారు. అన్ని సంక్షేమ పథాకాల్లోనూ మహిళలనే లబ్ది దారులను చేసారు. పదవుల్లోనూ 50 శాతం మహిళలకే కేటాయిస్తూ వచ్చారు. తాజాగా శాసనమండలి అభ్యర్ధులుగా ఖరారు అయిన వారితో కౌన్సిల్ లో అధికార పార్టీ బలం 44కు చేరుతుంది. అందులో బీసీలు 19, ఎస్సీలు 6, ఎస్టీ ఒకరు, మైనార్టీలు నలుగురు.. మొత్తంగా 30 మంది ఉంటారు. టీడీపీ హయాంలో 2014-19 మధ్య శాసనమండలిలో ఆ పార్టీకి 48 మంది సభ్యులు ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 18 మందికి అవకాశం దక్కింది.
కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకు
తమ మంత్రివర్గ సహచరుల నుంచి స్థానిక సంస్థల వరకు సామాజిక న్యాయం అమలు చేసిన అంశాన్ని ఇప్పుడు వైసీపీ ప్రదాన ప్రచారాస్త్రంగా మలచుకుంది. ప్రస్తుత కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను (50 శాతం) సీఎం జగన్ రాజ్యసభకు పంపారు. రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో బీసీలకు 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 9 జడ్పీ ఛైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.1,43,178.78 కోట్లు జమ చేశారు.

ప్రతిపక్షాల పై సామాజికాస్త్రం..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలు బీసీ వర్గాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. దీనికి వైసీపీ మంత్రులు కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. 2014-19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న సమయంలో సామాజిక న్యాయం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతీ సభలోనూ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా అగ్రవర్ణ పేదలు అంటూ వారిని ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి అందుతున్న సంక్షేమ వివరాలతో ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. దీని ద్వారా సంక్షేమం కొనసాగాలంటే జగన్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు కాని సంక్షేమం - సామాజిక న్యాయం ఇప్పుడు ప్రతిపక్షాల పైన జగన్ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications