Tdp Vs Jansena: బలం ఉందని చెప్పడం వేరు.. దాన్ని నిరూపించుకోవడం వేరు
బలం ఉందని చెప్పడం వేరు.. ఆ బలాన్ని నిరూపించుకోవడం వేరు. తనకింత బలం ఉందని చెప్పడంద్వారా కావల్సింది ఆశించడం వేరు.. ఆ బలాన్ని నిరూపించి ఆశించింది నాకివ్వండి అని డిమాండ్ చేయడం వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ చేస్తున్నది కూడా ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపునకు సహకరించగల శక్తి జనసేనకు ఉందనేది నిర్వివాదాంశం. కానీ సహకరిస్తున్నానుకదా అని ఏకంగా ముఖ్యమంత్రి పదవే అడిగితే అత్యాశకు వెళ్లినట్లవుతుందని, వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ఇద్దరూ కలిసి ముందుకు వెళ్లాలని సీనియర్ రాజకీయవేత్తలు సూచిస్తున్నారు.

ప్రతిపాదన సహేతుకంగా లేదు
జనసేనాని మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇరుపార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ను ప్రకటించలనే డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన సహేతుకంగా లేదని ఉభయ కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా అంటున్నారు. అంతేకాకుండా జనసేన రాజకీయ అపరిపక్వతను బయట పెట్టుకుంటోందంటున్నారు.
జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తే ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ను ప్రకటించడం వేరు.. అలా కాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తే చంద్రబాబునాయుడు తనకున్న అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారని, ఆ పార్టీ ఏమన్నా జనసేన, బీజేపీల స్థాయిలో ఉందా? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పొత్తులు లేకుండా వెళ్దామంటున్న టీడీపీ
ఈసారి ఎన్నికలు 2014 ఎన్నికల మాదిగా ఉండవని అర్థమవుతోంది. తెలుగుదేశం, జనసేన మధ్య దూరం పెరిగిందని స్పష్టమవుతోంది. బీజేపీ నాయకులు పవన్తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. పవన్కల్యాణ్ రెండో ఆప్షన్పై చంద్రబాబునాయుడినే అడగాలన్నారు. ఇప్పుడు కూడా టీడీపీకి పల్లకీ మోయడానికి తాము సిద్ధంగా లేమని జనసేన కార్యకర్తలంటున్నారు. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీచేద్దామంటూ తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బలంగా ఉన్న టీడీపీకి ఎవరి సహకారం అవసరం లేదంటున్నారు. పొత్తులు లేకపోయినా గెలవగలిగే సత్తా టీడీపీకి ఉందంటున్నారు. పొత్తుల విషయమై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాకుండానే ఇరు పార్టీల నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివాన కాకుండా చూడాల్సిన బాధ్యత ఇరుపార్టీల అధినేతలపైనే ఉంది.!!

జరుగుతున్నదాన్ని మౌనంగా పరిశీలిస్తున్న వైసీపీ
తెలుగుదేశం, జనసేన మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలను అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మౌనంగా పరిశీలిస్తోంది. ఈ పరిణామాలను తమకు అనువుగా మలచుకోవడానికి అవకాశం కోసం ఆ పార్టీ సీనియర్ నేతలు ఎదురు చూస్తున్నారని, అయితే వారికి ఆ అవకాశం ఇవ్వదలచుకోకుంటే ఇరు పార్టీల్లో ఎవరో ఒకరు తగ్గాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. లేదంటే పిల్లి పోరు పిల్లి పోరు పిట్ట తీర్చిందన్నట్లుగా భవిష్యత్తు పరిణామాలు మారతాయంటున్నారు.












Click it and Unblock the Notifications