ఇంటి ముంగిటకే జగన్ మార్క్ పాలన - పొరుగు రాష్ట్రాల ఆసక్తి: సీఎం సక్సెస్ మంత్ర ఇదే..!!
ఇంటి వద్దకే పాలన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే అందుబాటులో ఉన్న జగన్ మార్క్ పాలన. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వార్డు - గ్రామ సచివాలయ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్..ప్రతీ గ్రామం - వార్డులో సచివాలయం అందుబాటులోకి వచ్చాయి. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు సేవలు మరింత సులభమైన పద్దతిలో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభించారు.

540 రకాల సేవలు -72 గంటల సమయం
ఈ వ్యవస్థ అందుబాటులోకి రావటంతో ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. గ్రామ - వార్డు సచివాలయాల్లోనే కావాల్సిన సేవలు - సర్టిఫికెట్ల జారీ అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా 540 పైగా సేవలను 72 గంటల్లోనే అందిస్తూ ఇంటి ముంగిటకు పాలన తీసుకొచ్చింది. కేంద్ర మంత్రులతో పాటుగా అనేక రాష్ట్రాలు ఈ విధానం పైన ఆసక్తి చూపించాయి. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించాయి. గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 540 సేవలు లంచాలు - ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయి. పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవిన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్ట్రీ రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరిస్తారు.

ఇంటి వద్దకే వాలంటీర్ - ఆపత్కాలంలో అండగా
ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 134694 మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. కాగా, 250838 వాలంటీర్లు వారికి అప్పగించిన ఇళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి దాకా 36851237 సేవల కోసం వినతులు రాగా, అందులో 36169154 అభ్యర్ధనలను పరిష్కరించారు. ప్రతీ నెలా 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వైఎస్సార్ పెన్షన్ అందిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఇంటి వద్ద లేకుండా ఆస్పత్రుల్లో ఉన్న లబ్దిదారుల వద్దకు వాలంటీర్లు వెళ్లి మరీ పెన్షన్ అందచేస్తున్నారు. ఆరోగ్య శ్రీ కార్డుల విషయంలో గంటల వ్యవధిలోనే పరిష్కారం చూపిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. జూలై 1న అందరినీ శాశ్వత ఉద్యోగులుగా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. జూలై 1 నుంచి పే-స్కేల్ తో పాటు ఇతర అలవెన్సులతో కూడిన జీతాల జీవితాలతో తీసుకొచ్చింది. ఈ మేరకు ఆగస్టు 1నుంచి ఉద్యోగులంతా పెరిగిన కొత్త జీతాలు అందుకుంటున్నారు. పోస్టుల వారీగా ప్రభుత్వం ఖరారు చేసిన పే స్కేల్ వివరాలు చూస్తే.. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5కి 23,120-74,770గా ఖరారు చేశారు. మిగిలిన పోస్టులకు రూ.22,460-72,810గా ఫిక్స్ చేశారు. అలాగే వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి రూ. 23,120-74,770గా పేర్కొంది.

జగన్ మార్క్ పాలనలో ట్రెండ్ సెట్టర్ గా
ఇందులో బేసిక్ పేకి హెచ్ఆర్ఏ, డీఏలు అదనంగా రానున్నాయి. ఇక, వాలంటీర్లకు గౌరవ వేతనం అందిస్తూ వారి సేవలు అందేలా చూస్తున్న ప్రభుత్వం వారికి గుర్తింపు ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏటా ఉగాది నాడు వాలంటీర్ల సత్కార కార్యక్రమాలకు సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా.. సేవారత్న, సేవామిత్ర.. పేరుతో ఇలా మంచి సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించారు. ప్రణాళిక శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. నిర్ధేశిత లక్ష్యాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15004 వార్డు - గ్రామ సచివాలయాల ద్వారా ప్రస్తుతం అనేక రకాలుగా సేవలు అందుతున్నాయి. ఇది పాలనా పరమైన సంస్కరణల్లో కీలకంగా మారుతోంది. గ్రామాల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి రావటంతో..పాలన మరింత సులభంగా మారింది. గ్రామ స్థాయిలో సచివాలయాలతో పాటుగా ఏర్పాటు చేస్తున్న అనేక కేంద్రాలు..మొత్తంగా గ్రామాల స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. జగన్ మార్క్ పాలనకు చిరునామాగా నిలుస్తున్నాయి.












Click it and Unblock the Notifications