ఏపీ భగ్గు: 'జైట్లీ గారు, దీనికి ప్రెస్మీట్ అవసరమా', జగన్ ఆగ్రహం!
విజయవాడ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాత్రి చేసిన ప్రకటన పైన విపక్షాలు విరుచుకు పడుతున్నాయి. ఇది చెప్పేందుకు ప్రత్యేకంగా అర్ధరాత్రి దాకా హైడ్రామా నడిపించి, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాలా అని ఎద్దేవా చేస్తున్నారు.
కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఎప్పుడో తేలింది. అయితే, బుధవారం మధ్యాహ్నం కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలు ఏపీకి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ, సాయం పైన స్పష్టమైన ప్రకటన చేస్తారని మంగళవారం రాత్రి నుంచి హడావుడి ప్రారంభమైంది.
ఆ 'పదాల'పై గుర్రు: నేను రానని జైట్లీకి బాబు షాక్, ప్రకటన ఆలస్యం వెనుక..
ఈ హైడ్రామా బుధవారం అర్ధరాత్రి దాకా నడిచింది. బుదవారం రాత్రి జైట్లీ, వెంకయ్య, సుజనా చౌదరిలు ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీకి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. విభజన చట్టంలోని హామీలన్నింటిని అమలు చేస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతికి రూ.2500 కోట్లు ఇచ్చామన్నారు. పోలవరం ఖర్చును భరిస్తామని చెప్పారు.
ఏపీని ఆదుకుంటామని చెప్పిన చెప్పి... ఎలా, ఎప్పటిలోగా అన్న విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. రోజంతా హైడ్రామా నడవడంతో దేనికి ఎంత ఇస్తారు, ఎన్ని నిధులు ఇస్తారో, అది హోదాకు తూగుతుందో చూడాలని చాలామంది ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ గతంలో చెప్పినట్లే ఏపీని ఆదుకుంటామని చెప్పి చేతులు దులుపుకున్నారు.
దీంతో విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రోజంతా హైడ్రామా నడిపించి, ఈ ప్రకటన అవసరమా అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా కేంద్రం నుంచి బయటకు రావాలని వైసిపి నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఏపీకి హోదా ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని సిపిఐ నారాయణ మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
జైట్లీ ప్రకటన పైన ఏపీ వ్యాప్తంగా గురువారం నాడు నిరసనలు వ్యక్తమయ్యాయి. అన్ని జిల్లాల్లో నిరసనలు తెలుపుతున్నారు. జైట్లీ ప్రకటన పైన ఓ విధంగా ఏపీ భగ్గుమంది. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ.. తదితర అన్నిచోట్ల ప్రత్యేక హోదా, మంచి ప్యాకేజీ కోసం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
వెంకయ్య థ్యాంక్స్
జైట్లీ చేసిన అసంపూర్తి ప్రకటనపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే జైట్లీ ప్రకటనను ఆయన పక్కనే కూర్చుని విన్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాత్రం అత్యుత్తమ ప్రకటనగా అభిప్రాయపడ్డారు.
ప్యాకేజీ ప్రకటన ముగిసి ఇంటికెళ్లిన వెంటటే ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన వెంకయ్య.. సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి అత్యుత్తమ పరిష్కారం చూపించారంటూ ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీని కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగా చూస్తోందని, ఈ కారణంగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఏపీ స్వయం సమృద్ది సాధించే దాకా కేంద్రం నుంచి సాయం అందుతుందని చెప్పారు. ఏపీ వేగంగా సమగ్రాభివృద్ధి సాధించేందుకు సాధ్యమైన ఉత్తమ పరిష్కారం ఇదేనన్నారు.
హోదాపై వైసిపి వాయిదా తీర్మానం
ఏపీకి జైట్లీ సాయం ప్రకటన పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపింది. ఈ రోజు (గురువారం) నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసిపి హోదా పైన చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నల్లని దుస్తులతో నిరసన తెలిపారు. అసెంబ్లీ వరకు ర్యాలీగా బయలుదేరారు. హోదా ఇవ్వకపోవడమే కాకుండా సహాయం పైన స్పష్టమైన ప్రకటన చేయని జైట్లీ తీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.