నాడు దీక్ష విరమిస్తే, మేం బతికించాం: కేసీఆర్పై విద్యార్థుల తీవ్ర వ్యాఖ్య
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కొంత భూమిని తీసుకొని పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన విద్యార్థులు, విపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. విద్యార్థులు కేసీఆర్ను ఏకి పారేస్తున్నారు. తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఉస్మానియా వర్సిటీలో ఏబీవీపీ, పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ తదితర విద్యార్థి సంఘాలు కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నాయి. ప్రతిరోజు ఓయులో నిరసనలు వ్యక్తం చేస్తూ, కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నాయి. విద్యార్థులకు విపక్షాలు కూడా వంత పాడుతున్నాయి.
ఓయు భూముల జోలికొస్తే కేసీఆర్ను ఫాంహౌస్ వరకు తరిమికొడతామని హెచ్చరించారు. బలహీనవర్గాలను విద్యకు దూరం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఇళ్ల పేరిట విద్యార్థులు, పేదవారికి దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఓయూ భూములు కబ్జా అవుతుంటే రూ.కోటడి మంజూరు చేసి ప్రహరీ గోడను నాడు ఎన్టీఆర్ కట్టించారన్నారు. విశ్వవిద్యాలయ స్థలాన్ని తెరాస ఎమ్మెల్యే కబ్జా చేశారని కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై కేసీఆర్ను విద్యార్థులు, ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
ఉస్మానియా విద్యార్థి జేఏసీ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. పోరాడటం చేతకాక 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షను అర్ధాంతరంగా విరమిస్తే, ఆత్మ బలిదానాలతో విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని బతికించారని ప్రకటనలో పేర్కొన్నారు.