హత్యా రాజకీయాలెవరివో తెలుసు: పల్లె, రాజీనామాకి సిద్ధమా: జగన్కు లోకేష్
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిల పైన కేసులు అక్రమమైనవి కావన్నారు. హత్యా రాజకీయాలు ఎవరివో రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం వేధించడం లేదన్నారు.
జగన్కు లోకేష్ ప్రశ్న
వైసిపి నేతలు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, మిథున్ రెడ్డిల అరెస్ట్ వెనుక టిడిపి ప్రమేయం లేదని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అఏన్నారు. చెవిరెడ్డిపై గతంలోనే కేసు నమోదైందని, ఆ కేసు ఫలితంగానే ఆయన అరెస్టయ్యారన్నారు. దానితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
మిథున్ రెడ్డి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో మిథున్, అక్కడి మేనేజరుపై దాడి చేసిన దృశ్యాలు బయటపెడితే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన జగన్, మాటకు కట్టుబడి ఉంటారా? అని లోకేష్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏ విధమైన కక్ష సాధింపు చర్యలకూ దిగడం లేదన్నారు.
2017లో విశాఖలో ఆసియా దేశాల విద్యాశాఖ మంత్రుల సమ్మిట్: గంటా
2017లో విశాఖపట్నంలో ఆసియా దేశాల విద్యాశాఖ మంత్రుల సమ్మిట్ జరగనుందని మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం తెలిపారు. విశ్వవిద్యాలయాలలో రాజకీయాల జోక్యం ఉండరాదన్నారు. అలాగే వర్సిటీల్లో కుల సంఘాల బోర్డులను అనుమతించని చెప్పారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని చెప్పారు. లండన్ పర్యటనలో అనేక విశ్వవిద్యాలయాలను తాము పరిశీలించామని చెప్పారు. మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలలను ఎన్జీవోలు దత్తత తీసుకొని విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు.
ఏయు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ
హైదరాబాదులో వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో.. మృతికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొందరు విద్యార్థులు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు డౌన్ డౌన్ వెంకయ్య నాయుడు అంటూ నినాదాలు చేశారు.