మైక్రోవేవ్, డివిడిల్లో తరలింపు: 63కేజీల బంగారం సీజ్, 18మంది అరెస్ట్
విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం అక్రమ రవాణాకు కేంద్రంగా మారుతోంది. సోమవారం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్ల నుంచి భారీస్థాయిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని స్మగర్లు ఎలక్ట్రానిక్ వస్తువుల్లో దాచి అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మైక్రోవేవ్ ఓవెన్, డీవీడీ ప్లేయర్లల్లో దాచి ఉంచిన 63 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక సమాచారం మేరకు మలేషియా, సింగపూర్ల నుంచి విశాఖపట్నం విమానాశ్రయం దిగిన వీరంతా తమిళనాడుకు చెందిన వారుగా తెలుస్తోంది. అనుమానాస్పదంగా తిరుగుతున్న సుమారు వందమందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కాగా, 18మంది వద్ద బంగారం లభించడంతో వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు, విచారిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
కాగా, ఈ నెలలో పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు ఒకసారి 12 కిలోల బంగారం పట్టుబడింది. ఇటీవలి కాలంలో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారుల తనిఖీల్లో భారీ మొత్తంలో బంగారం పట్టుబడుతుండటంతో స్మగ్లర్లు విశాఖ విమానాశ్రయం వైపు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.