షర్మిల కు చెక్, సీన్ రివర్స్ - ఢిల్లీలో కీలక పరిణామాలు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. బీజేపీ ఈ సారి ఏపీ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇదే సమయంలో జగన్ ఎన్నికల్లో ఓడటంతో పార్టీ బలోపేతానికి సరైన సమయంగా భావించిన కాంగ్రెస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించింది. అయితే, కేవలం జగన్ ను విమర్శించేందుకే షర్మిల పరిమితం అయ్యారని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్తున్నాయి. సొంత పార్టీ నేతలే షర్మిలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
అన్నతో విభేదించిన తరువాత షర్మిల ఏరి కోరి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి షర్మిల పార్టీ బలోపేతానికి ఏం చేసారనే ప్రశ్న పార్టీ నుంచి వినిపిస్తోంది. జాతీయ స్థాయి లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే.. ఏపీలో మాత్రం షర్మిల అందుకు భిన్నంగా కూటమికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తన అన్న పైన కోపంతో ప్రతీ సందర్భంలోనూ జగన్ నే టార్గెట్ చేస్తే పార్టీకి ప్రయోజనం ఏంటని సొంత పార్టీ నేతలు హైకమాండ్ కు పరిస్థితి వివరించారు. జగన్ ఎన్నికల్లో ఓడి ఏడాది పూర్తయినా ఇంకా జగన్ ను లక్ష్యంగా చేసుకొని షర్మిల విమర్శలు చేయటం ద్వారా పార్టీ పైన ప్రజల్లో ఎలాంటి భావన ఏర్పడుతుందో గుర్తించి.. షర్మిల తీరులో మార్పు తీసుకురావాలని తాజాగా కాంగ్రెస్ లో కీలక పదవి నిర్వహించిన నేత ఏఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.

ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ షర్మిల వ్యవహారశైలితో మరింత దిగజారిపోయే అవకాశముందని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. జగన్ పైన తన కోసం తీర్చుకోవడానికి పదవిని అడ్డంపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు హస్తం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల షర్మిలపై సుంకర పద్మశ్రీ వరుస సమావేశాలు నిర్వహిస్తూ సంచలనంగా మారారు. షర్మిలకు కుటుంబ తగాదాలే తప్ప పార్టీ పట్టలేదని జిల్లాలు తిరిగి ఆరోపిస్తున్నారు. ఏఐసీసీ మెంబర్ గా ఉన్న సుంకర పద్మశ్రీ జిల్లాల్లో పర్యటిస్తూ వైఎస్ షర్మిల కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నుంచి సంతకాలను కూడా సేకరిస్తున్నారు. కూటమి అందించిన స్క్రిప్టు ను చదువుతూ షర్మిల విమర్శలు చేస్తున్నారని నిలదీస్తున్నారు.
అధికార పార్టీని ప్రశ్నిచకుండా ప్రతి పక్ష పార్టీని ప్రశ్నించడమేంటని సుంకర పద్మశ్రీ అన్ని సమావేశాల్లోనూ షర్మిల పైన ఫైర్ అవుతున్నారు. అయితే షర్మిల మాత్రం తాను అనుకున్న ట్లుగానే పార్టీని నడపాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అటు బెంగళూరు నుంచి కొందరు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ముఖ్య నేతలకు షర్మిల తీరు పైన ఫిర్యాదులు చేస్తున్నారు. త్వరలోనే ఈ సమస్యలకు అన్నింటికి పరిష్కారం ఉంటుందని ఏపీకి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతకు ఢిల్లీ నాయకత్వం హామీ ఇచ్చిందనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. దీంతో, షర్మిల పైన వరుసగా వస్తున్న ఫిర్యాదుల వేళ పార్టీ ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications